
- ప్రధాని మోదీకిసీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
- ట్రిపుల్ ఆర్ నార్త్, సౌత్ ఒకేసారి చేపట్టాలి
- రీజినల్ రింగ్ రైల్ మంజూరు చేయండి
- బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ డ్రైపోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించండి
- సెమీ కండక్టర్, డిఫెన్స్ ప్రాజెక్టులు కేటాయించాలని వినతి
న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను పోయినేడాది నవంబర్ 4నే కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందజేశామని చెప్పారు. అందులో కొన్ని స్పష్టీకరణలు కోరగా, వాటికి సమాధానాలు కూడా ఇచ్చామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్లో ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ తర్వాత సాయంత్రం 5:05 గంటలకు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై వినతిపత్రాలు అందజేశారు.
కేంద్రం వివిధ రాష్ట్రాల్లో మెట్రో విస్తరణకు ఇప్పటికే ఆమోదం తెలిపిందని ప్రధాని మోదీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. 2024 అక్టోబర్లో చెన్నై మెట్రో ఫేజ్–2 (రూ.63,246 కోట్లు), 2021 ఏప్రిల్లో బెంగళూరు మెట్రో ఫేజ్–2 (రూ.14,788 కోట్లు), 2024 ఆగస్టులో బెంగళూరు మెట్రో ఫేజ్-–3 (రూ. 15,611 కోట్లు)కి అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు కూడా అనుమతి ఇవ్వాలని కోరారు. ‘‘రూ.22 వేల కోట్లతో నిర్మించిన హైదరాబాద్ మెట్రో ఫేజ్–1లో 69 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లు ఉన్నాయి. అయితే నగరంలోని ఇతర ప్రాంతాలకు మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉంది. గత 10 ఏండ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి విస్తరణ చేపట్టలేదు. మా ప్రభుత్వం స్థానిక అవసరాలను గుర్తించి మెట్రో విస్తరణ కోసం ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. ఈ ఫేజ్–2లో 76.4 కిలోమీటర్ల మేర 5 కారిడార్లు ఉంటాయి. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టాలి. దీనికి మొత్తం రూ.24,269 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో కేంద్రం 18% (రూ.4,230 కోట్లు), రాష్ట్రం 30% (రూ.7,313 కోట్లు) భరించాలి. మరో 48% (రూ.11,693 కోట్లు) రుణం తీసుకుంటం” అని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
గ్రీన్ఫీల్డ్ హైవేతో ఉద్యోగాలు..
ట్రిపుల్ ఆర్కు సమాంతరంగా 370 కిలోమీటర్ల పరిధిలో రీజినల్ రింగ్ రైల్ నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే బందరు పోర్టు నుంచి హైదరాబాద్ డ్రైపోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.‘‘దేశంలోని ఫార్మా ఉత్పత్తుల్లో 35 శాతం తెలంగాణ నుంచే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తే ఎగుమతులు సులభమవుతాయి. ఈ మార్గం తయారీ రంగానికి ప్రోత్సాహకంగా ఉండడంతో పాటు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది” అని సీఎంరేవంత్ రెడ్డి వివరించారు.
ఆ రెండు రంగాలకు మద్దతు ఇవ్వండి..
తెలంగాణకు సెమీ కండక్టర్, డిఫెన్స్ ప్రాజెక్టులు కేటాయించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ‘‘ఇండియా సెమీ కండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)కు తెలంగాణ పూర్తి మద్దతు ఇస్తున్నది. హైదరాబాద్లో ఏఎండీ, క్వాల్కం, ఎన్వీఐడీఐఏ, ఆర్అండ్డీ కేంద్రాలు ఉన్నాయి. అలాగే పరిశ్రమలకు స్థలాలు, నైపుణ్యమున్న మానవ వనరులు, మౌలిక సదుపాయాలు హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణకు ఐఎస్ఎం ప్రాజెక్టును మంజూరు చేయాలి. అది పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుంది. 2030 నాటికి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో 500 బిలియన్ డాలర్లకు చేరుకోవాలనే మా లక్ష్యానికి తోడ్పడుతుంది” అని పేర్కొన్నారు. హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘హైదరాబాద్లో ఎన్నో రక్షణ రంగ సంస్థలు ఉన్నాయి. కానీ డిఫెన్స్ రంగంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడుతో పోల్చితే తెలంగాణకు అంతటి ప్రోత్సాహం లేదు. ఆయా రాష్ట్రాలతో సమానంగా తెలంగాణకు మద్దతు ఇవ్వాలి. రక్షణ రంగ పరికరాల తయారీలో ముందున్న హైదరాబాద్లో డిఫెన్స్ ఎక్స్పో నిర్వహించాలి” అని కోరారు. ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలన్నారు.
ట్రిపుల్ ఆర్కు అప్రూవల్స్ ఇవ్వండి..
హైదరాబాద్ చుట్టూ రెండు జాతీయ రహదారులతో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి గుర్తు చేశారు. ఎన్హెచ్–161లోని ట్రిపుల్ ఆర్ నార్త్ పార్ట్ సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్– గజ్వేల్– భువనగిరి–చౌటుప్పల్ వరకు.. ఎన్హెచ్ 65లోని ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ చౌటుప్పల్–అమన్గల్–షాద్నగర్–సంగారెడ్డి వరకు ఉంటుందని తెలిపారు. ‘‘ట్రిపుల్ ఆర్ నార్త్కు సంబంధించి భూసేకరణ 2022లోనే ప్రారంభమైంది. భూసేకరణ వ్యయంలో రాష్ట్రం 50 శాతం భరిస్తున్నది. ఇప్పటికే 90% భూముల ప్రపోజల్స్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు పంపించాం. ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలిచింది. దీని నిర్మాణానికి అవసరమైన ఫైనాన్స్ అప్రూవల్స్ ఇవ్వాలి” అని కోరారు. నార్త్, సౌత్ నిర్మాణాలను ఒకేసారి చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే భూసేకరణ, నిర్మాణ వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. సౌత్కు సంబంధించి భూసేకరణ వ్యయంలో 50% భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.