- ప్రతిపక్ష నేత శుక్రాచార్యుడిలా తయారైండు: సీఎం రేవంత్ రెడ్డి
- మారీచ సుబాహుల్లాగా బావబామ్మర్దులను పంపి.. ప్రభుత్వ పనులకు అడ్డుపడుతున్నడు
- ఆయనకు రాజకీయ సమాధి తప్పదు
- రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఎవరినైనా కలుస్తా
- తుమ్మిడిహెట్టిని పూర్తి చేసి, ఆదిలాబాద్ను సస్యశ్యామలం చేస్తం
- బాసర ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీ.. 10 వేల ఎకరాలతో ఉమ్మడి ఆదిలాబాద్లో పారిశ్రామిక కారిడార్
- నిర్మల్కు ఏటీసీ, నాగోబా జాతరకు రూ.22 కోట్లు మంజూరు చేస్తున్నట్టు వెల్లడి
- చనాఖా-కొరాట, సదర్మాట్ బ్యారేజీలను ప్రారంభించిన సీఎం
- చనాఖా-కొరాటకు రాంచందర్ రెడ్డి, సదర్మాట్కు నర్సారెడ్డి పేరు పెడ్తున్నట్టు ప్రకటన
- నిర్మల్ ‘ప్రజాపాలన-ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం ప్రసంగం
నిర్మల్/ఆదిలాబాద్, వెలుగు: సర్కారును బద్నాం చేసేందుకు ఫామ్హౌస్ కేంద్రంగా కుట్ర జరుగుతున్నదని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. ‘‘పదేండ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్.. తన అనుభవంతో మా ప్రభుత్వానికి సహకరించాల్సిందిపోయి, బావాబామ్మర్దులను (హరీశ్, కేటీఆర్) మా ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్నారు. 40 ఏండ్ల రాజకీయ అనుభవం, పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఉన్న పెద్ద మనిషి.. మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే చేతనైతే ఆశీర్వదించాలి.. లేదంటే సూచనలు చేయాలి.. ఏదీ ఇష్టం లేకుంటే మౌనంగా ఫామ్హౌస్లోనే పండుకోవాలి.
కానీ మనం పురాణాల్లో చూశాం కదా.. దేవతలు యజ్ఞాలు, యాగాలు చేస్తే శుక్రాచార్యుడి సూచనలతో మారీచుడు, సుబాహుడు వచ్చి ఆ యాగాలను, యజ్ఞాలను భగ్నం చేసేవాళ్లు. వాళ్లు చివరికి రాముని చేతిలో ఓడిపోయారు. అలాగే ఈ రోజు కూడా ఫామ్హౌస్లో ఉన్న శుక్రాచార్యుడు.. బావబామ్మర్దుల ముసుగులో ఉన్న మారీచ సుబాహులను అసెంబ్లీకి పంపి, మా ప్రభుత్వానికి అడ్డం పడుతున్నాడు. ఆయనకు కూడా చివరికి రాజకీయంగా సమాధే అవుతుంది’’ అని హెచ్చరించారు.
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని హత్తిఘాట్ వద్ద చనాఖా–కొరాట బ్యారేజీని, నిర్మల్జిల్లా మామడ మండలం పోన్కల్ వద్ద నిర్మించిన సదర్మాట్ బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించి, యాసంగి పంటలకు నీళ్లు విడుదల చేశారు. అనంతరం నిర్మల్లోనిఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ బహిరంగ సభలో మాట్లాడారు. ఓడిపోయిన, పడిపోయిన వారి గురించి తాను మాట్లాడదలుచుకోలేదని సీఎం అన్నారు. ఫామ్హౌస్లో ఏనుగులా పండుకున్న వారి గురించి పట్టించుకోదలచుకోలేదని, కానీ తాము చేస్తున్న పనులకు అడ్డు తగలడాన్నే ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం..
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల కోసం ప్రధానిని, కేంద్ర మంత్రులను ఎలాంటి భేషజాలు లేకుండా కలుస్తున్నానని సీఎం రేవంత్ తెలిపారు. ప్రతిపక్షాలు దాన్ని కూడా తప్పుబట్టడం దురదృష్టకరమన్నారు. ‘‘కేంద్ర సహకారం లేకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా.. . వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితేనే మంజూరయ్యాయి’’ అని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర సహకారం తీసుకోకుండా ఇష్టారాజ్యంగా రూ. 8.11 లక్షల కోట్ల అప్పులు చేసిందని, ఆ అప్పుల చిక్కుముడులు ఒక్కొక్కటిగా విప్పుతున్నామన్నారు.
హైదరాబాద్లో ఎయిర్పోర్టు పక్కన 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్సిటీ నిర్మిస్తున్నామని.. అది జీర్ణించుకోలేని కొంతమంది.. ‘ప్రభుత్వ పెద్దలు రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారారు’ అంటూ విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని, 2034 వరకు తామే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న మున్సిపల్ఎన్నికల్లో పనులు చేసే వారిని గెలిపించాలని కోరారు.
ఆదిలాబాద్ను అభివృద్ధి చేస్తం..
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పూర్తిచేసి ఆదిలాబాద్జిల్లాను సస్యశ్యామలం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా నిర్మల్లో రైతుల సమస్యలపై ఆందోళన చేశాను. ఆ తర్వాత ఇంద్రవెల్లి సభలో పాల్గొన్నాను. నా సొంత జిల్లా పాలమూరు లాగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిధులు ఇస్తాను” అని హామీ ఇచ్చారు.
‘‘గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేసినా జిల్లాకు గోదావరి జలాలు రాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి సాగు నీరు రావాలంటే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాల్సిందే. బడ్జెట్ సమావేశాల లోపు తుమ్మిడిహట్టిపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా. బీఆర్ఎస్పదేండ్ల పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. ఈజిల్లాకు యూనివర్సిటీని మంజూరు చేస్తున్న. ఈ ప్రాంత ప్రజలు, విద్యావంతుల డిమాండ్మేరకు బాసరలోని ట్రిపుల్ఐటీలో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు పార్టీలకతీతంగా అందరూ సహకరించాలి” అని కోరారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో అతి పెద్ద పారిశ్రామికవాడ కారిడార్ ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం 10 వేల ఎకరాలు కేటాయిస్తామని ప్రకటించారు. దేశంలోనే అన్ని బడా పారిశ్రామిక సంస్థలను రప్పిస్తామని.. దీంతో ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నిర్మల్ నియోజకవర్గానికి ఏటీసీని మంజూరు చేస్తున్నట్టు, ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా జాతరకు రూ. 22 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
అభివృద్ధి పనులకు సంబంధించి జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి.. ఇక్కడి ప్రజాప్రతినిధులందరితో రివ్యూ చేసి నివేదిక అందజేయాలని సూచించారు. ఆ నివేదిక ఆధారంగా ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎర్రబస్సు రాని ఆదిలాబాద్జిల్లాకు ఎయిర్ బస్సులను తీసుకవచ్చిన ఘనత తమదేనన్నారు.
51 వేల ఎకరాలకు సాగునీరు..
చనాఖా-కొరాట బ్యారేజీకి మాజీ మంత్రి రాంచందర్రెడ్డి పేరును, సదర్మాట్బ్యారేజీకి నిర్మల్ప్రాంతానికి చెందిన నర్సారెడ్డి పేరును పెడుతున్నట్టు ప్రకటించారు. ‘‘ప్రజల చిరకాల స్వప్నం చనాఖా–కొరాట ప్రాజెక్టును మా ప్రభుత్వం సాకారం చేసింది. రూ.1,891 కోట్ల వ్యయంతో 5.12 టీఏంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ రూరల్, భీంపూర్, జైనథ్, బేల మండలాలలోని 89 గ్రామాలలో 51 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
తాంసి, భీంపూర్ మండలాల్లో 15 గ్రామాలకు చెందిన మరో 13,500 ఎకరాలకు నీరందించేందుకు రూ.368 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేశాం. ఇందుకు 3,313 ఎకరాల భూమి అవసరం ఉండగా, ఇప్పటివరకు 1,545 ఎకరాల భూమి సేకరించి రూ.117 కోట్లు ఖర్చు చేశాం. సాత్నాల నదిపై 1.675 కిలోమీటర్ల మేర నిర్మించిన ప్రీకాస్ట్ పోస్ట్ టెన్షన్డ్ వయాడక్ట్ కోసం రూ. 259.81 కోట్లు మంజూరు చేశాం” అని వెల్లడించారు.
కాగా, డ్వాక్రా మహిళలకు రూ.500 కోట్ల వడ్డీ లేని రుణాలను, రూ.107 కోట్ల రుణాలను సీఎం రేవంత్రెడ్డి అందజేశారు. అలాగే నిర్మల్ఉత్సవాలపై లోగో, పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగోబా ఆలయ కమిటీ సభ్యులు జాతరకు రావాలని ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణరావు, ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్వర్రెడ్డి, రామారావు పటేల్, వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చుక్క నీరు వదులుకోం: ఉత్తమ్
దేశంలో ఎక్కడా లేని విధంగా 70 లక్షల టన్నుల వడ్ల దిగుబడితో తెలంగాణ రికార్డు సృష్టించిందని ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. నిర్మల్సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గోదావరి జలాల విషయంలో బీఆర్ఎస్ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. పోలవరం, నల్లమల్ల సాగర్ప్రాజెక్టుల విషయంలో మేం రాజీలేని పోరాటం చేస్తున్నం. సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం. గోదావరిలో చుక్క నీరును కూడా వదులుకోం. గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది.
మేం ఆ ప్రాజెక్టును నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాకు గోదావరి జలాలను తరలిస్తాం. నిర్మల్జిల్లాలోని కాళేశ్వరం 27వ నంబర్ప్యాకేజీ పనులకు రూ.97 కోట్లు మంజూరు చేస్తున్నం” అని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో కాశ్మీర్ను తలపించే ప్రాంతాలు ఉన్నాయని, ఇక్కడ టూరిజంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లతో మాస్టర్ ప్లాన్రూపొందిస్తున్నామన్నారు.
