హైదరాబాద్, వెలుగు: తాను సకల జన హితుడినని.. సామాన్య మనిషినని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘నేను.. చేరలేని దూరం కాదు.. దొరకనంత దుర్గం కాదు, సామాన్య మనిషిని నేను.. సకల జన హితుడను నేను’’ అని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని సీఎం మాదిరిగా కాకుండా.. తాను సామాన్య జనానికి అందుబాటులో ఉన్నట్టు పరోక్షంగా చెప్పారు.
శనివారం సాయంత్రం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులను ఆయన నేరుగా కలుసుకున్నారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వచ్చిన వారి బాధలను వినడంతో పాటు సంబంధిత శాఖలకు సూచనలు చేశారు. కొన్ని సమస్యలను ఎన్నికల కోడ్ ముగియగానే పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ ఉద్యోగి దయాకర్ తనకు 317 జీవో కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను తెలియజేయగా.. కోడ్ ముగియగానే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.