- వడ్లు, పత్తి తడవకుండా సెంటర్లలో ఏర్పాట్లు చేయండి
- లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలి
- వైద్యారోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలి
- అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. పరిస్థితిపై బుధవారం ఆయన అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకొని, దిశానిర్దేశం చేశారు. పలుచోట్ల కళ్లాల్లో వడ్లు ఆరబోసినందున ఎటువంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండటంతోపాటు హైదరాబాద్, ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అలర్ట్గా ఉండాలని సీఎం చెప్పారు.
మొంథా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయం చేసుకోవాలని.. కలెక్టర్లు ఆయా బృందాలకు తగిన మార్గదర్శకత్వం వహించాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలన్నారు. రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లో లెవల్ బ్రిడ్జీలు, కాజ్ వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలని తెలిపారు. వర్షం నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించి అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ప్రజల నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదులపై జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే స్పందించాలని సీఎం ఆదేశించారు.
జనజీవనానికి ఆటంకం కలగొద్దు: మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనానికి ఆటంకాలు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బుధవారం ఆయన భారీ వర్షాలపై విపత్తుల నిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాల్లో రక్షణ సంబంధిత చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. విద్యుత్తు, పంచాయతీ రాజ్, ఆర్&బి వంటి ఇతర విభాగాలతో రెవెన్యూ యంత్రాంగం తప్పనిసరిగా సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని పొంగులేటి సూచించారు.
