మోదీ పదేండ్లలో రాష్ట్రానికి చేసిందేంటి? : సీఎం రేవంత్

మోదీ పదేండ్లలో రాష్ట్రానికి చేసిందేంటి? : సీఎం రేవంత్
  • ఏం చూసి మూడోసారి ఓటెయ్యాలి? : సీఎం రేవంత్
  • ‘పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలి’ అన్నట్టుగా బీజేపీ వ్యవహారం
  • ఏప్రిల్ 6 లేదా 7న తుక్కుగూడలో జనజాతర సభ
  • 100 రోజుల పాలనకు లోక్ సభ ఎన్నికలు రెఫరెండం 
  • 14 సీట్లలో గెలుపే లక్ష్యమని వెల్లడి
  • చేవెళ్ల లోక్ సభ సెగ్మెంట్ నేతలతో సీఎం మీటింగ్ 

హైదరాబాద్, వెలుగు : ప్రధాని మోదీ పదేండ్లలో రాష్ట్రానికి ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏం చూసి మూడోసారి మోదీకి ఓటు వేయాలని బీజేపీ అడుగుతున్నదని మండిపడ్డారు. ‘‘మోదీ రాష్ట్రానికి ఏం చేశారు? ప్రాణహిత–చేవెళ్ల పూర్తి చేయలేదు. వికారాబాద్ దాకా ఎంఎంటీఎస్ పొడిగించలేదు. బుల్లెట్ ట్రైన్ గుజరాత్ కు తీసుకెళ్లిన మోదీ.. వికారాబాద్ కు ఎంఎంటీఎస్ రైలు ఎందుకు తీసుకురాలేదు. గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసుకున్న మోదీ.. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి మాత్రం నిధులు ఇవ్వలేదు. రీజనల్ రింగ్ రోడ్డు రాకుండా బీజేపీ ఎందుకు అడ్డుకుంటున్నది?

ఏం చూసి మూడోసారి మోదీకి ఓటు వేయాలని బీజేపీ అడుగుతున్నది? ‘పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలి’ అన్నట్టుగా బీజేపీ నేతల వ్యవహారం ఉన్నది” అని విమర్శించారు. మంగళవారం చేవెళ్ల పార్లమెంట్​నియోజకవర్గ ముఖ్య నాయకులతో జూబ్లీహిల్స్​లోని కార్యాలయంలో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. చేవెళ్ల లోక్‌‌‌‌సభ అభ్యర్థి రంజిత్‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌‌‌‌రెడ్డితో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్​మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుంది.

క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉంది. హైకమాండ్ అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరిలో సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ లో దానం నాగేందర్ ను అభ్యర్థులుగా ప్రకటించింది” అని తెలిపారు. 

తుక్కుగూడ నుంచే ఎన్నికల శంఖారావం.. 

రంగారెడ్డి జిల్లా నుంచే లోక్ సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నట్టు రేవంత్‌‌‌‌ రెడ్డి చెప్పారు. తుక్కుగూడలో జరిగే జనజాతర సభకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌‌‌‌ గాంధీ హాజరవుతారని తెలిపారు. ‘‘కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు నడిచారు. పార్టీకి అండగా నిలబడి సోనియమ్మ నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

తుక్కుగూడ సభలోనే అసెంబ్లీ ఎన్నికలకు ఆరు గ్యారంటీలను ప్రకటించుకున్నాం. ఇప్పుడు ఏప్రిల్ 6 లేదా 7న అక్కడ జరిగే సభలోనే జాతీయస్థాయి గ్యారంటీలను ప్రకటించబోతున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్​ప్రభుత్వ వంద రోజుల పరిపాలనకు రెఫరెండంగా ఉంటుంది. తెలంగాణలో పార్టీని 14 స్థానాల్లో గెలిపించి సోనియమ్మకు కృతజ్ఞత చెబుదాం” అని పిలుపునిచ్చారు.