
హైదరాబాద్, వెలుగు: పింఛన్లు, రైతు భరోసా స్కీమ్లకు పాత లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. వీటిపై ఎలాంటి అపోహలకు గురికావొద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో రైతుబంధు, ఆసరా పెన్షన్లు పొందుతున్న వారి వివరాలు సర్కార్ దగ్గర ఉన్నాయని.. వీటికి గతంలో లబ్ధిపొందనివాళ్లు, కొత్తవాళ్లు మాత్రమే అప్లయ్ చేసుకోవాలని సూచించారు.
ప్రజా పాలన దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్షించారు. అభయ హస్తం దరఖాస్తుల విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావొద్దని ఆయన సూచించారు. మహాలక్ష్మీ, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు వంటి వాటికి యథావిధిగా అర్హత ప్రకారం దరఖాస్తు పెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇబ్బందులు రాకుండా చూడాలి..
ప్రజా పాలన అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు ప్రభుత్వమే ఉచితంగా దరఖాస్తులను అందజేస్తున్నదని తెలిపారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైనన్ని అప్లికేషన్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని ఆయన అన్నారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.