
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన స్పోర్ట్స్ పాలసీని ఆవిష్కరించేందుకు నిర్వహించిన తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ సూపర్ హిట్ అయింది. శనివారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన తొలి ఎడిషన్ దేశ క్రీడా రంగాన్ని ఆకర్షించింది. లెజెండరీ అథ్లెట్లు అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, పుల్లెల గోపీచంద్, అంజు బాబీ జార్జ్, అనిల్ కుంబ్లే తో పాటు ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కల్యాణ్ చౌబే, వరల్డ్ అథ్లెటిక్స్ వైస్ చైర్మన్ అదిల్లే సుమరివాల వంటి స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్లను ఒక్క చోటకు చేర్చి వారి సమక్షంలో పాలసీ ప్రత్యేకతలను తెలియజేసింది. దేశంలోని ప్రముఖ సంస్థలతో కీలక భాగస్వామ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకొని రాష్ట్రంలో క్రీడాభివృద్దికి కీలక బాటలు వేసింది. ఈ సందర్భంగా దిగ్గజ అథ్లెట్లు, అడ్మినిస్ట్రేటర్లు ప్యానెల్ డిస్కషన్స్లో తమ అనుభవాలతో పాటు విలువైన సూచనలు చేశారు.
హైదరాబాద్లో ఫిఫా టాలెంట్ అకాడమీ
ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) సహకారంతో ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఫెడరేషన్ (ఫిఫా) అమ్మాయిల కోసం దేశంలో తొలి టాలెంట్ అకాడమీని (బాయ్స్ కోసం రెండోది) హైదరాబాద్లో ఏర్పాటు చేయడం కోసం ఎంఓయూ కుదుర్చుకోవడం కాంక్లేవ్లో హైలైట్గా నిలిచింది. గచ్చిబౌలి స్టేడియం కాంప్లెక్స్లో ఫిఫా ఈ అకాడమీ ఏర్పాటు చేయనుంది. ఈ అకాడమీలో 30 మంది గర్ల్స్ (అండర్16), 30 మంది బాయ్స్ (అండర్14) సహా మొత్తం 60 మంది యంగ్స్టర్స్కు ఏడాది పొడవునా హైలెవెల్ కోచింగ్, బోర్డింగ్, ఎడ్యుకేషన్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. ప్రతీ కేటగిరీలో పది మంది తెలంగాణ ప్లేయర్లకు అవకాశం ఇస్తారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్న ఏఐఎఫ్ఎఫ్ ప్రెసిడెంట్ కల్యాణ్ చౌబే ఇండియా ఫుట్బాల్ చరిత్రలో దీన్ని ఒక చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఇది దేశాన్ని ప్రముఖ ఫుట్బాల్ దేశంగా మార్చాలనే విజన్ 2047 లక్ష్యానికి అనుగుణంగా ఉందన్నారు.
టీఎస్డీఎఫ్ పర్యవేక్షణ బోర్డు చైర్మన్గా గోయెంకా
స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ కోసం 14 మందితో కూడిన బోర్డు ఆఫ్ గవర్నర్స్ (పాలక మండలి)ను ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ను (టీఎస్డీఎఫ్)ను సమర్థవంతంగా, జవాబుదారీతో పర్యవేక్షించేందుకు దీన్ని ఏర్పాటు చేసింది. నూతన స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏర్పాటైన ఈ బోర్డు చైర్మన్గా ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్, ప్రముఖ వ్యాపార వేత్త సంజీవ్ గోయెంకా చైర్మన్గా, ఉపాసన కొణిదెల కో–చైర్మన్గా ఉంటారని వెల్లడించింది. ఇందులో కపిల్ దేవ్, అభినవ్ బింద్రా, బైచుంగ్ భుటియా, పుల్లెల గోపీచంద్, రవికాంత్ రెడ్డి వంటి మేటి స్పోర్ట్స్ పర్సన్లు మెంబర్లుగా ఉన్నారు. మరో ముగ్గురు వ్యాపారవేత్తలకు అవకాశం కల్పించింది. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, క్రీడా శాఖ చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ ప్రతినిధులుగా ఉంటారు.