 
                                    - సాయంత్రం వెంగళరావు నగర్, సోమాజిగూడలో సభలు
- రేపు బోరబండ, ఎర్రగడ్డ సభల్లో పాల్గొననున్న రేవంత్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో శుక్రవారం నుంచి సీఎం రేవంత్రెడ్డి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఎన్నికల్లో రేవంత్ ప్రచార కార్యక్రమాల షెడ్యూల్ను పీసీసీ ఇప్పటికే విడుదల చేసింది. దీని ప్రకారం ఆయన శుక్రవారం సాయంత్రం 7 గంటలకు వెంగళరావు నగర్, రాత్రి 8 గంటలకు సోమాజిగూడ డివిజన్లో జరగనున్న సభల్లో పాల్గొంటారు. అక్కడి ఓటర్లనుద్దేశించి ప్రసంగిస్తారు.
శనివారం సాయంత్ర 7 గంటలకు బోరబండలో, రాత్రి 8 గంటలకు ఎర్రగడ్డలో జరగనున్న ఎన్నికల సభల్లోనూ సీఎం పాల్గొననున్నారు. వరుసగా శుక్ర, శని వారాలు రెండు రోజులపాటు సీఎం ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననుండడంతో..ఆయా డివిజన్లకు ఇన్చార్జీలుగా ఉన్న మంత్రులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కాగా, మూడు రోజుల కిందట యూసఫ్గూడలో జరిగిన సభకు సీఎం హాజరైనా..అది సినీ కార్మికుల అభినందన సభగానే కాంగ్రెస్ ప్రకటించింది.
ప్రచారం మరింత ఊపు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే నెల 11న జరగనున్నది. 9వ తేదీతో ప్రచారం ముగియనుండడంతో సీఎం రేవంత్.. క్యాంపెయినింగ్ నిర్వహించేందుకు షెడ్యూల్ను సిద్ధం చేసుకున్నారు.ఈ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉండగా.. ఒక్కో డివిజన్కు ఇద్దరేసి మంత్రులను ఇన్చార్జీలుగా నియమించారు. గత మూడు రోజులుగా మంత్రులు ఇంటింటి ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రంగంలోకి దిగనుండడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోనున్నది.

 
         
                     
                     
                    