
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి ... నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రూ. 100 కోట్లతో నిర్మించిన జహీరాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని. మాచనూర్ లో రూ.26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభించచిన అనంతరం పస్తాపూర్ బహిరంగ సభలో మాట్లాడారు.
ఈ సభలో ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. అధికారం ఉంటేనే సభకు వస్తామంటే కుదరదని చురకలంటించారు. శాసనసభకు రావాలంటూ... మీ రాజకీయ అనుభవంతో మేము తప్పులు చేస్తే చెప్పండి సరిదిద్దుకుంటామన్నారు. గతంలో కాంగ్రెస్ పదేళ్ల పాటు ప్రతిపక్షపాత్రను పోషించదన్నారు. ముఖ్యమంత్రిగా తాను ఏ రోజు అహంకారంతో వ్యవహరించలేదంటూ.. ప్రజల్లో ఉంటేనే ఏదో ఒక రోజు అధికారం వస్తుందన్నారు. చిన్నా.. పెద్ద లేకుండా అందరిని కలుపుకొని పోతామని పస్తాపూర్ సభలో తెలిపారు.
అంతకు ముందు హగ్గెల్లి కూడలిలో బసవేశ్వర విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. దీంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బసవేశ్వరుడు ఆనాడే సామాజిక న్యాయం కోసం పోరాడాడని.. ఆయన సందేశాలే ఇందిరమ్మ పాలనకు సూచికగా భావిస్తున్నామన్నారు.
సామాజిక న్యాయాన్ని అందించే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. జనగణనలో కుల గణన చేయాలని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలతో కలిసి నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ పాఠశాల భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు.