
హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం సంస్థ ప్రతి ఏటా రూ.400 కోట్లు వెచ్చిస్తూ.. హాస్పిటల్స్ ఆధునికీకరణ, వైద్య పరికరాలు, ఔషధాలు సమకూర్చేందుకు సిద్ధంగా ఉందని సీఎండీ ఎన్.బలరామ్ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్లో అన్ని ఏరియా ఆసుపత్రుల ప్రధాన వైద్యాధికారులతో సమీక్ష సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ చిన్న ఆరోగ్య సమస్యలకు స్థానికంగా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, సింగరేణి వైద్యులు అన్ని కేసులను హైదరాబాద్కు రిఫర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిన్నచిన్న వ్యాధులకు స్థానిక ఏరియా ఆసుపత్రుల్లోనే చికిత్స అందించాలని సూచించారు. హైదరాబాద్కు రిఫర్ చేయడంతో సంస్థ హెల్త్బడ్జెట్ ఖర్చు గత మూడేండ్లలో రూ.30 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ఏరియా ఆసుపత్రులు అవసరమైన పరికరాలు, మందుల కోసం ప్రతిపాదనలు పంపడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
సంస్థ డాక్యుమెంట్లను బయటి వ్యక్తులకు ఇస్తే కఠిన చర్యలు
సింగరేణికి సంబంధించిన గోప్యమైన సమాచారం, డాక్యుమెంట్లను బయటి వ్యక్తులకు అందజేయవద్దని.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని సంస్థ డైరెక్టర్ (పర్సనల్) హెచ్చరించారు. ఈ మేరకు గురువారం సర్క్యులర్ జారీ చేశారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు సంస్థ ఉద్యోగులు, అధికారులను బెదిరించి కంపెనీకి సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సంస్థ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఆ వ్యక్తుల వివరాలను యాజమాన్యానికి తెలియజేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.