నర్సంపేట, వెలుగు: మొదటిసారి ఓటు హక్కు వచ్చిన యువకుడు.. సద్వినియోగం చేసుకునేందుకు వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశాడు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం పాత ముగ్ధుంపురం గ్రామానికి చెందిన వేములపల్లి మోహిత్ శ్రీరామ్ అనే యువకుడు.. గుజరాత్ రాష్ట్రం వడోదర పట్టణంలోని పారుల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడికి ఇటీవలే కొత్తగా ఓటు హక్కు వచ్చింది. బుధవారం తన స్వగ్రామం ముగ్ధుంపురంలో పంచాయతీ ఎలక్షన్లు ఉండడంతో రెండు రోజుల క్రితం గుజరాత్ నుంచి బయల్దేరి ఇక్కడికి వచ్చాడు. సర్పంచ్ ఎలక్షన్లలో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్నాడు.
యూరప్ నుంచి గ్రామానికి..
పరిగి, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓ యువకుడు విదేశం నుంచి స్వగ్రామానికి వచ్చాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండివెలికిచర్ల గ్రామానికి చెందిన నవీన్కుమార్ యూరఫ్లోని ఐర్లాండ్ లో ఉంటున్నాడు. అక్కడి నుంచి వచ్చి బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
