రామస్వామి సమస్య పరిష్కరిస్తాం..వెలుగు కథనానికి సీఎంవో స్పందన

రామస్వామి సమస్య పరిష్కరిస్తాం..వెలుగు కథనానికి సీఎంవో స్పందన

 

  • సీఎంఓ నుంచి ఆదేశాలొచ్చాయి
  • వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​ రెడ్డి 

వరంగల్‍, వెలుగు:  వరంగల్​లో ధరణిలో పొరపాటుతో రియల్లర్ల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న శ్రీభద్రి రామస్వామి సమస్యను పరిష్కరిస్తామని వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి హామీ ఇచ్చారు. ‘నాది కాని భూమి నాకొద్దు.. వెనక్కి తీస్కొని నన్ను కాపాడండి’ హెడ్డింగ్​తో మంగళవారం వీ6 వెలుగులో వార్త పబ్లిష్​అయ్యింది. ధరణిలో రామస్వామి పేరిట రూ.4 కోట్ల భూమి ఉన్నట్టు నమోదు కాగా, ఆ భూమి తనకు వద్దని, సర్కారు వెనక్కి తీసుకోవాలని పోరాడుతున్నాడు.  రియల్టర్లు, లీడర్లు, పోలీస్‍, రెవెన్యూ అధికారులు బెదిరిస్తుండడంతో ఇంటి ముందు సీసీ కెమెరాలు బిగించుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్నాడు.

 ఈ పరిస్థితిని ప్రచురించడంతో  సీఎంఓ స్పందించిందని వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండ అశోక కన్వెన్షన్‍ హాల్‍లో నిర్వహించిన ప్రెస్‍మీట్ కు రామస్వామి కుటుంబాన్ని తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రియల్టర్లు తనను ఎలా బెదిరిస్తున్నారో రామస్వామిని మీడియా ముందు చెప్పారు. సమస్య కలెక్టర్ దృష్టిలో ఉందని.. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం అతని నుంచి భూమి వెనక్కు తీసుకునేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. కాగా, చివరి అవకాశంగా రంగంలోకి దిగిన కొందరు నేతలు, అధికారులు మంగళవారం సైతం రామస్వామి వెంట పడటం గమనార్హం.