2029లో గెలిచేటోళ్లు ఐదేళ్లు సీఎంగా ఉండరా.. : కేంద్రం తీసుకొస్తున్న చట్టం ఏం చెబుతోంది..?

2029లో గెలిచేటోళ్లు ఐదేళ్లు సీఎంగా ఉండరా.. : కేంద్రం తీసుకొస్తున్న చట్టం ఏం చెబుతోంది..?

One Nation One Election: చాలా కాలం నుంచి జెమిలి ఎన్నికల గురించి దేశంలో చర్చ కొనసాగుతూనే ఉంది. ఒకటే దేశం ఒకేసారి ఎన్నికలు అనే విధానాన్ని అమలులోకి తీసుకురావటం కోసం ప్రస్తుతం ప్రయత్నం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తొలివిడత జెమిలి ఎన్నికలు 2034లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనికోసం ముందుగా చట్టపరమైన సవరణలు తీసుకురావాల్సి ఉంటుందని తెలిసిందే. 

జెమిలి ఎన్నికలు బిల్లుకు ఆమోదం పొందితే దాని ప్రకారం ఎన్నికలు నిర్వహించటే క్రమంలో 2029 తర్వాత ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఐదేళ్ల పదవీకాలం ముగియక మునుపే అధికారం కోల్పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 2034లో దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగే జెమిలి ఎన్నికల కోసం తక్కువ కాలానికి పదవీకాలం ముగించాల్సి ఉంటుంది. 

దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ద్వారా తేదీని ఖరారు చేయవచ్చు. ఈ తేదీ తర్వాత ఏర్పడిన అన్ని రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలం ఆ లోక్‌సభ ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో ముగుస్తుంది. ఏదైనా ఒక రాష్ట్ర అసెంబ్లీకి ఏకకాల ఎన్నికలలో భాగంగా ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం చెబితే.. ఆ విషయంలో రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు. ఆ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రపతి తరువాత ఉత్తర్వులు జారీ చేయవచ్చని తెలుస్తోంది. 

"ఒక దేశం, ఒక ఎన్నిక"పై జెపీసీ పదవీకాలాన్ని 2025 వర్షాకాల సమావేశాల చివరి వారం మొదటి రోజు వరకు పొడిగించే తీర్మానాన్ని మార్చిలో లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో జెమిలి కంటే ముందే ప్రభుత్వం 5 ఏళ్ల అసెంబ్లీ పాలనను పూర్తి చేసుకుంటే అక్కడ మళ్లీ ఎన్నికలు జరపకుండా తర్వాత జరిగే జెమిలి ఎన్నికల సమయంలో నిర్వహిస్తారని తెలుస్తోంది.