V6 News

నిజామాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ లో టీపీసీసీ వద్దకు కోఆప్షన్ పంచాది

నిజామాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ లో టీపీసీసీ వద్దకు కోఆప్షన్ పంచాది
  •     కాంగ్రెస్ నుంచి 20 మంది ఆశావహులు 
  •     ఐదు స్థానాల్లో రెండింటి కోసం మజ్లిస్​ పట్టు
  •     21తో ముగియనున్న దరఖాస్తుల గడువు 
  •     నేడు నగర పార్టీ నేతలతో మహేశ్​ ​గౌడ్​ మీటింగ్​

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​లో కోఆప్షన్​పదవుల భర్తీకి రిలీజైన నోటిఫికేషన్ ​కాంగ్రెస్, మజ్లిస్​ పార్టీల్లో పొలిటికల్ ​హీట్ ​పుట్టించింది. కాంగ్రెస్​ నుంచి ఈ పోస్టులు ఆశిస్తున్న వారి సంఖ్య 20 దాటడంతో సర్దుబాటు చేయడం పార్టీ సీనియర్లకు తలనొప్పిగా మారింది. మిత్రపక్షమైన మజ్లిస్​ రెండు సీట్లు కావాలని పట్టుబడుతోంది. ఈ నెల 21 వరకు అప్లికేషన్లు అందజేయాల్సి ఉంది. 

పోటీ తీవ్రంగా ఉండడంతో ఎంపిక వ్యవహారం టీపీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​ వద్దకు చేరింది. దీంతో నేడు నగర కాంగ్రెస్​ నేతలతో చర్చించి ఎంపికను కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మజ్లిస్​కు ఎన్ని స్థానాలు ఇవ్వాలనే సంగతిని కూడా ఆయనే నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. ఏకాభిప్రాయంతో పదవులను ఏకగ్రీవం చేయాలని మహేశ్​ గౌడ్​ భావిస్తున్నారు. ఎన్నిక​జరిగే పరిస్థితి ఎదురైతే ఒక స్థానంలో పోటీ చేయాలని బీజేపీ ఆలోచిస్తోంది.

నేతల పోటీ
  
కార్పొరేషన్​లో మొత్తం ఐదు కోఆప్షన్ ​పదవులున్నాయి. జనరల్​ కేటగిరీలోని మూడు స్థానాల నుంచి ఒక మహిళను కచ్చితంగా ఎన్నుకోవాలి. మాజీ కార్పొరేటర్లు, సెంట్రల్, స్టేట్​గవర్నమెంట్​నుంచి గెజిటెడ్​ హోదాలో రిటైరైన వారు, కనీసం మూడేండ్లు మున్సిపల్ స్టాండింగ్​ కౌన్సిల్​గా పనిచేసినవారు, లోకల్​బాడీ సంస్థలో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న మరో ఇద్దరిని కోఆప్షన్​ పదవులకు ఎన్నుకోవాలి. ఈ మూడు స్థానాలు పోను మిగితా రెండు కోఆప్షన్​సీట్లను మైనారిటీ కేటగిరీకి రిజర్వ్ చేశారు. ఇందులో కూడా ఒక మహిళకు అవకాశం ఇవ్వాలి. కార్పొరేటర్లకు సమాన హోదాతో కోఆప్షన్​సభ్యులు ఉంటారు. 

కార్పొరేషన్​లో మొత్తం 60 మంది కార్పొరేటర్లుండగా బీజేపీ నుంచి 28 మంది, కాంగ్రెస్​నుంచి 17, ఎంఐఎం​నుంచి 14, ఒకరు బీఆర్ఎస్​కార్పొరేటర్​ఉన్నారు. పరస్పర మద్ధతుతో మేయర్, డిప్యూటీ మేయర్​ పదవులను కాంగ్రెస్, మజ్లిస్ ​కలిసి దక్కించుకున్నాయి. కోఆప్షన్​పదవుల్లోనూ అదే అవగాహనతో వెళ్లాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. కార్పొరేషన్​ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన ఏడుగురు నేతలు, టికెట్ల దక్కని మరో ఏడుగురు, ఐదుగురు మాజీ కార్పొరేటర్లు, కొత్తగా పార్టీలో చేరిన మరో ఇద్దరు కోఆప్షన్​రేస్​లో ఉన్నారు. వీరి మధ్య రాజీ కుదర్చడానికి స్థానిక నేతలు తలలు పట్టుకుంటున్నారు. 

కీలకం కానున్న మీటింగ్

మున్సిపల్​లో ఐదు పదవులుండగా అన్నే అప్లికేషన్లు వస్తే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. కానీ అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే కార్పొరేటర్ల ఓటింగ్ నిర్వహిస్తారు. పదవులు ఆశిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎలక్షన్ ​జరుగొచ్చని అంచనా వేస్తున్న బీజేపీ.. తమకున్న 28 మంది బలంతో ఒక సీటుకు పోటీ చేయాలనుకుంటోంది. 

కానీ ఇందుకు చాన్స్​ఇవ్వకుండా మజ్లిస్​కు ఒక స్థానాన్ని కేటాయించే ప్రతిపాదన ముందు పెట్టి, కుదరని పక్షంలో అడిగిన రెండు సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ ​యోచిస్తోంది. మిగితా స్థానాలను ఆశావహుల మధ్య ఏకాభిప్రాయంతో యునానిమస్​చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు మహేశ్​గౌడ్​నేతృత్వంలోని హైదరాబాద్​లో జరిగే మీటింగ్​పై సర్వాత్రా ఆసక్తి నెలకొంది.