హైదరాబాద్, వెలుగు: జిల్లాల్లోని నిరుద్యోగులు మరోసారి సిటీ బాట పడుతున్నరు. హుజూరాబాద్ బై ఎలక్షన్ టైమ్ లో తొందరలోనే నోటిఫికేషన్లు వస్తాయని మంత్రులు,ఎమ్మెల్యేలు చెప్పడంతో పాటు కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో మరోసారి ప్రిపేర్ అయ్యేందుకు నిరుద్యోగులు సిటీలోని కోచింగ్ సెంటర్లకు వస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు కోచింగ్ తీసుకున్నప్పటికీ నోటిఫికేషన్ వేస్తే ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో మళ్లీ జాయిన్ అవుతున్నారు. ఇలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దిల్సుఖ్ నగర్, అశోక్నగర్, అమీర్పేట ప్రాంతాలకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్లు తరలి వస్తున్నారు.
సిటీలో వెయ్యి వరకు కోచింగ్సెంటర్స్ ఉన్నాయి. కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్తో సెంటర్లు మూతపడటంతో స్టూడెంట్లు అంతా సొంతూళ్లకు వెళ్లారు. ఈ ఏడాది ఆగస్టులో తిరిగి కోచింగ్సెంటర్లు ఓపెన్అయినప్పటికీ జాయిన్ అయ్యేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. ప్రస్తుతం మంత్రులు, ఎమ్మెల్యేలు నోటిఫికేషన్ల గుర్తించి ప్రస్తావిస్తుండడంతో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో మళ్లీ జాయిన్ అవుతున్నారు.
స్టడీ హాల్స్.. లైబ్రరీలు
కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు స్టడీ హాల్స్ కు వెళ్తున్నారు. మరికొందరు చిక్కడపల్లిలోని సిటీ లైబ్రరీ, అఫ్జల్ గంజ్ లో సెంట్రల్ లైబ్రరీలో సొంతంగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ రెండు లైబ్రరీల వద్ద బల్దియా రూ.5 భోజనం ఫెసిలిటీ కూడా ఉండటంతో చాలామంది ఇక్కడికే వస్తున్నారు. గ్రూప్–1, గ్రూప్– 2, టెట్, డీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ తో పాటు మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. వారిలో చాలామంది సిటీకి వచ్చి కోచింగ్ సెంటర్లలో జాయిన్ అవుతున్నారు. గతంలో నోటిఫికేషన్ వేయకపోవడంతో కొందరు ప్రైవేట్జాబ్స్లో చేరారు, మరికొందరు కూలీ పని, ఇంకొందరు పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు.