గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్జీ 2 డివిజన్ పరిధిలోని జీడీకే 7 ఎల్ఈపీ గనిలో గత ఏడాది నవంబర్ నెలలో బొగ్గు ఉత్పత్తి నిలిపివేశారు. ప్రస్తుతం గనిని మూసివేసే చర్యలు చేపడుతున్నారు. గనిలో బొగ్గు వెలికితీసినచోట్ల ఇసుక లేదంటే బూడిదను నింపాల్సి ఉండగా కేవలం గోడలు మాత్రమే నిర్మిస్తున్నారు. రెండు వైపులా ఉన్న ఓపెన్ కాస్ట్లలో చేసే బ్లాస్టింగ్ వల్ల గనిలో నిర్మించిన గోడలు కూలిపోతాయని, తద్వారా భూమి కంపిస్తే గని పైప్రాంతంలో నివాసాలకు ముప్పు ఏర్పడుతుందని పలు కాలనీల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
1993 నుంచి బొగ్గు ఉత్పత్తి..
సింగరేణి రామగుండం రీజియన్లో 1991 అక్టోబర్లో జీడీకే 7 లైఫ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ (ఎల్ఈపీ) టన్నెల్తవ్వడం మొదలుపెట్టారు. 1993 జూన్లో బొగ్గు వెలికితీయడం ప్రారంభించారు. ఈ గనిలోని మూడో సీమ్(పొర)లో 11 మీటర్లు, నాలుగో సీమ్లో నాలుగు మీటర్ల మందంతో బొగ్గు పొరలుండేవి. మొత్తం గనిలో 53 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నట్టు గుర్తించగా, గని మూసివేసే 2021 నవంబర్ 4వ తేదీ నాటికి 48 లక్షల టన్నులు వెలికితీశారు. 5న గని మూసివేశారు. ఇంకా ఐదు లక్షల టన్నుల బొగ్గు నిల్వలు గనిలోనే ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ దీనిని మూసియాలనే నిర్ణయం తీసుకుంది. ఈ గనిలో 800 మంది ఉద్యోగులు పని చేయగా, వారిలో 85 మంది మినహా మిగిలిన వారిని జీడీకే 11వ గని, వకీల్పల్లి, ఏఎల్పీ గనులకు బదిలీ చేసింది.
రూ.35 కోట్ల ఖర్చుకు వెనకాడుతున్న మేనేజ్మెంట్
జీడీకే 7 ఎల్ఈపీ గనిలోని 3వ, 4వ సీమ్లలో 182 గ్యాలరీలు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వైపున ఉన్న టన్నెల్లో మరికొన్ని గ్యాలరీలు ఉన్నాయి. బొగ్గు వెలికితీసినచోట కప్పు కుంగకుండా ఆ ప్రాంతంలో ఇసుక లేక బూడిద నింపాలి. అయితే ఈ గనిలో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేసిన తర్వాత ఖాళీ ప్రదేశాలలో మేనేజ్మెంట్ సిమెంట్ ఇటుకలతో ఐసోలేషన్ వాల్స్ నిర్మిస్తోంది. గనికి రెండు వైపులా ఓపెన్ కాస్ట్ 3, ఓపెన్ కాస్ట్ 5 ఉన్నాయి. ఈ రెండు ఓసీపీలలో బొగ్గు, మట్టిని వెలికితీసేందుకు ప్రతిరోజు బ్లాస్టింగ్ చేస్తారు. ఈ బ్లాస్టింగ్లకు జీడీకే 7 ఎల్ఈపీ గనిలోని గోడలకు పగుళ్లు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల బయటి నుంచి గాలి లోపలికి వెళ్లి గ్యాలరీలలో ఉన్న బొగ్గు మండే ప్రమాదం ఉంటుంది. ఖాళీ ఏర్పడిన గ్యాలరీలలో ఇసుక లేక బూడిదను నింపడానికి రూ.35 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేయగా, దీనిని భరించేందుకు మేనేజ్మెంట్ వెనకడుగు వేస్తున్నది. అందుకే తక్కువ ఖర్చుతో కేవలం మీటర్ వెడల్పుతో గోడలను నిర్మించే పనికే పరిమితమవుతున్నదని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
ప్రమాదంలో కాలనీల ప్రజలు
జీడీకే 7 ఎల్ఈపీ గనిలో భూగర్భంలో 30 మీటర్ల లోతులోనే బొగ్గును వెలికితీశారు. అయితే బొగ్గును తొలగించిన ప్రాంతంలోని పైభాగంలో ఓసీపీ 3 సీహెచ్పీ, ఆర్జీ 1 కోల్హ్యాండ్లిగ్పాయింట్(సీహెచ్పీ)లకు రైల్వే ట్రాక్లను నిర్మించారు. ఈ సీహెచ్పీలలో బొగ్గు నింపుకొన్న తర్వాతనే రైల్వే వ్యాగన్లు రామగుండం రైల్వే స్టేషన్కు చేరుకుని అక్కడి నుంచి నిర్దేశిత ఫ్యాక్టరీలకు వెళతాయి. అలాగే గని పైభాగంలో రామగుండం కార్పొరేషన్కు చెందిన 13, 35, 36, 37 డివిజన్ల పరిధిలోని విఠల్నగర్, 7బి కాలనీ, తిలక్నగర్, రమేశ్నగర్, చంద్రశేఖర్ నగర్ పరిధిలోని సుమారు ఐదువేల నివాసాలుంటాయి. దీనికి తోడు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కూడా గని పైభాగంలోనే ఉంటుంది. ఈ క్రమంలో జీడీకే 7 ఎల్ఈపీ గని ఖాళీ ప్రదేశాలలో ఇసుక లేక బూడిద నింపకుండా కేవలం అక్కడక్కడ గోడలు నిర్మిస్తే భూమి కుంగిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(డీఎంఎస్) ఆఫీసర్లు జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని యూనియన్ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.