
- పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు కింద దేశవ్యాప్తంగా 2.23 లక్షల మంది ఉద్యోగులకు చెల్లింపు
- గతేడాది కన్నా రూ.9,250 అధికం
- సింగరేణిలో 41 వేల మంది కార్మికులకు అందనున్న బోనస్
- సంబురాల్లో సింగరేణి కార్మికులు
కోల్బెల్ట్, వెలుగు: దేశ వ్యాప్త బొగ్గు గని కార్మికులకు దీపావళి సందర్భంగా చెల్లించే బోనస్ను (పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు బోనస్) కోల్ ఇండియా యాజమాన్యం శుక్రవారం ప్రకటించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్మికులకు 1,03,000 రూపాయలను బోనస్ కింద చెల్లించనున్నట్లు తెలిపింది. పీఎల్ఆర్ బోనస్ చెల్లింపు విషయంపై గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కోల్కతాలో ఆరో కోల్ ఇండియా స్టాండర్డైజేషన్ కమిటీ (జేబీసీసీఐ) సమావేశం జరిగింది. ఎంసీఎల్ సీఎండీ ఉదయ్ ఏ కాలే అధ్యక్షతన కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, సీఐటీయూ సంఘాలతో కోల్ ఇండియా ఆఫీసర్లు చర్చలు జరిపారు.
సింగరేణి తరఫున సంస్థ డైరెక్టర్ గౌతమ్ పొట్రు పాల్గొన్నారు. ఈ పీఎల్ఆర్ బోనస్ను రూ.1.50 లక్షలు చెల్లించాలని కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేయగా.. రూ. 98 వేలు చెల్లించేందుకు కోల్ ఇండియా యాజమాన్యం ప్రతిపాదించింది. దీనిని నిరసిస్తూ కార్మిక సంఘాల ప్రతినిధులు చర్చలను బాయ్కాట్ చేశారు. తర్వాత అర్ధరాత్రి టైంలో కార్మిక సంఘాల ప్రతినిధులు, యాజమాన్యం మధ్య మరో సారి చర్చలు జరిగాయి. చివరకు ఒక్కో కార్మికుడికి రూ. 1,03,000 చెల్లించేందుకు యాజమాన్యం ఒప్పుకోగా.. కార్మిక సంఘాల ప్రతినిధులు సైతం ఓకే చెప్పారు.
గతేడాది కన్నా రూ.9,250 ఎక్కువ
సింగరేణి కార్మికులు గతేడాది పీఎల్ఎర్ బోనస్ కింద రూ.93,750 అందుకున్నారు. ఈ సారి రూ. 9,250 అదనంగా కలిపి మొత్తం రూ. 1.03 లక్షలు అందుకోనున్నారు. కోల్ ఇండియా చరిత్రలోనే బొగ్గు గని కార్మికులకు అందిన అతి ఎక్కువ బోనస్ ఇదే. 2010– -11 ఆర్థిక సంవత్సరంలో కార్మికులు రూ. 21 వేల బోనస్ను తీసుకున్నారు. ఆ తర్వాత బోనస్ క్రమంగా పెరుగుతూ ఈ సంవత్సరం రూ. లక్ష దాటింది.
దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు కంపెనీల్లో సుమారు 2.23 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా సింగరేణిలో 41 వేల మంది ఉన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కనీసం 30 రోజులు పనిచేసిన ఉద్యోగులకు మాత్రమే పీఎల్ఆర్ బోనస్ అందుతుంది. ఈ బోనస్ కోల్ ఇండియా ఉద్యోగులకు శుక్రవారమే అందనుండగా.. సింగరేణి కార్మికులకు మాత్రం దీపావళికి ముందు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. కార్మికులకు బోనస్ చెల్లించే తేదీలను త్వరలోనే ప్రకటించి.. డబ్బులు వారి అకౌంట్లలో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
పీఎల్ఆర్ బోనస్ పెంపుపై సంబురాలు
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బొగ్గు గని కార్మికులకు ఇచ్చే బోనస్ను రూ.9,250 పెంచడం పట్ల ఐఎన్టీయూసీ లీడర్లు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియా ఎస్సార్పీ-3 గనిపై ఐఎన్టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్రావు ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. జేబీసీసీఐ సమావేశంలో ఐఎన్టీయూసీ ఒత్తిడితోనే అత్యధిక బోనస్ దక్కిందని లీడర్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో లీడర్లు సీహెచ్ భీమ్రావు, గరిగస్వామి, కలవేణ శ్యాం, తిరుపతి రాజు, పేరం రమేశ్, ఏనుగు రవీందర్రెడ్డి, జీవన్ జోయల్, భీమ్ రవి, చాట్ల అశోక్, ఐరెడ్డి తిరుపతి రెడ్డి, లాగల శ్రీనివాస్ పాల్గొన్నారు.