కరోనా నిర్థారణ పరీక్షల కోసం హైదరాబాద్ నిమ్స్లో కొత్తగా ఏర్పాటు చేసిన ‘కోబాస్ 8800’ యంత్రాన్ని మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నామని, ఇప్పటికే అనేక రకాల పరికరాలను సమకూర్చామన్నారు.
మాలెక్యులర్ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ ద్వారా 3800 నుంచి 4వేల వరకు శాంపిల్స్ను పరీక్షించవచ్చని తెలిపారు ఈటల. కోబాస్ 8800 మిషన్ ద్వారా రోజుకు 4వేల ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయవచ్చన్నారు. దీని ద్వారా వేగంగా రోగులను గుర్తించి వారిని ఐసోలేషన్ చేసే అవకాశం ఉందన్నారు. దీనికి రూ.7 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రాపిడ్ టెస్టుల సంఖ్యను కూడా పెంచామన్నారు. రోజుకు 20వేల ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే సామర్థ్యం ఉందన్నారు. అంతేకాదు త్వరలోనే కరోనా బాగా తగ్గుతుందని భావిస్తున్నట్టు చెప్పారు మంత్రి ఈటల.