కూలిపోతున్న కొండలు.. కొట్టుకుపోతున్న గ్రామాలు.. ఈశాన్య రాష్ట్రాల్లో 34 మంది మృతి

కూలిపోతున్న కొండలు.. కొట్టుకుపోతున్న గ్రామాలు.. ఈశాన్య రాష్ట్రాల్లో 34 మంది మృతి

ఈశాన్య రాష్ట్రాలను వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు కురుస్తుండటంతో గ్రామాలు, పట్టణాలను వరదలు ముంచుస్తున్నాయి. ఒక వైపు కొండచరియలు విరిగి పడుతుండటం.. మరోవైపు వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. కొండచరియలు విరిగిపడుతుండటంతో గ్రామాలు గ్రామాలే మునిగిపోయే పరిస్థతి ఏర్పడింది. వానలు, వరదల బీభత్సానికి ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 34 మంది మృతి చెందినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. 

గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రజలను నిలువనీడ లేకుండా చేస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, సిక్కిం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కొండ చరియలు విరిగి పడుతుండటంతో రవాణా మార్గాలు దెబ్బతిన్నాయి. కొండలు కూలి పెద్ద పెద్ద బండరాళ్లు గ్రామాలపై పడుతుండటంతో ఊహించని ప్రమాదాలు జరుగుతున్నాయి. మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. నాగాలాండ్, మిజోరం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాలలో చాలా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్స్ ప్రకటించిడం చూస్తే ఎంత ఆందోళన కరమైన పరిస్తితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 

సోమవారం (జూన్ 2) వేయి మందికి పైగా టూరిస్టులు సిక్కింలో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు మేఘాలయ రాష్ట్రంలో వరదల్లో చిక్కుకున్న 5 వందల మందిని కాపాడేందుకు బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని అక్కడి ప్రభుత్వం తెలిపింది. 

అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెట్లు విరిగి పడటంతో రోడ్లు ధ్వంసమయ్యాయి. భారీ వరదలతో సిల్చార్ సిటీ జలమయమైనట్లు తెలిపారు. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కనీసం కూర్చోవడానికి కూడా స్థలం లేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలు తడిసి బూజు పట్టడంతో పిల్లలు ఆకలికి అలమటిస్తున్నట్లు తెలిపారు. 

వరద బురదలోనే 19 జిల్లాలు:

ఆదివారం (జూన్ 1) తీస్తా నదిపై నిర్మానంలో ఉన్న సంకలంగ్ బ్రిడ్జి భారీ వరదలకు కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు వరద నీరు క్రమంగా పెరగటంతో బ్రిడ్జి కూలిపోయినట్లు తెలిపారు అధికారులు. జోంగు, చుంగ్ తాంగ్, లచుంగ్, లాచెన్ జిల్లాలకు కనెక్టిటీగా ఉన్న బ్రిడ్జి కూలడంతో అస్సాంలో రాకపోకలు ఆగిపోయాయి. ఇక ఈశాన్య రాష్ట్రాలలో దాదాపు 19 జిల్లాలు వరదలోనే కూరుకుపోయినట్లు అధికారలు తెలిపారు. 24 గంటల్లో 42 సెంటీమీటర్ల వర్షం కురవడంతో బరక్ లోయ ప్రాంతాలు పూర్తిగా ప్రభావితం అయ్యాయి. కరింగంజ్, హైలకండి ప్రాంతాలలో 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

బ్రహ్మపుత్ర నదితో పాటు కటాఖల్, బరాక్, బురిదెహింగ్ నదులు వాటి సామర్థ్యానికి మించి ప్రవహిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. నదులు పొంగి పొర్లుతుండటంతో పరివాహక ప్రాంతాలన్నీ కొట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈశాన్య రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు లక్షా 44 వేల ఇండ్లు ధ్వంసమైనట్లు అస్సాం డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ పేర్కొంది.