
- ఓవర్ స్పీడ్.. పట్టిచ్చిన స్పీడ్గన్
- ఇద్దరి వాహనాలకూ ఫైన్ వేసిన సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు
- కలెక్టర్కు రూ. 2,305, జాయింట్కలెక్టర్కు రూ. 8,680 చలానా
సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు: ట్రాఫిక్ రూల్స్ఉల్లంఘించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్, జాయింట్కలెక్టర్ వాహనాలకు ట్రాఫిక్పోలీసులు ఫైన్వేశారు. జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ టీఎస్29ఎఫ్0001 నెంబర్ఉన్న వాహనాన్ని వాడుతున్నారు. జేసీ సంజీవరెడ్డి టీఎస్29 7979 నంబర్ఉన్న వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ రెండు వెహికల్స్ ఓవర్ స్పీడ్తో ప్రయాణించాయని స్పీడ్ లేజర్ గన్ (కెమెరా) ద్వారా స్పష్టమైంది. రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ల కిందకు వచ్చే వివిధ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ రెండు వాహనాలు స్పీడ్ లేజర్ గన్ కు చిక్కాయి. జిల్లా కలెక్టర్ వాహనం 139 కి.మీ. వేగంతో ప్రయాణించింది. అలాగే ఖమ్మంలో రాంగ్ పార్కింగ్ చేసినట్లూ గుర్తించారు. దీంతో రెండింటికి కలిపి రూ. 2305 జరిమానాను ఈ–చలాన్ ద్వారా విధించారు. ఇక జేసీ వాహనం 142 కి.మీ. వేగంతో వెళ్లినట్లు స్పీడ్ గన్ నమోదు చేసింది. మొత్తంగా 8 సార్లు పరిమితికి మించిన వేగంతో ఈ వాహనాన్ని నడిపినట్లు గుర్తించారు. దీంతో 8 ఉల్లంఘనలకు కలిపి మొత్తం రూ. 8680 జరిమానాను విధించారు. అయితే, ఈ చలానా 2017 నుంచే పెండింగ్లో ఉండటం, ఇప్పటివరకు కట్టకపోవడం గమనార్హం.