
హైదరాబాద్, వెలుగు: ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి ప్రోగ్రామ్లో ఆయన పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏదైనా మండలానికి సంబంధించి ఫిర్యాదు ప్రజావాణికి వచ్చిన వెంటనే సంబంధిత తహసీల్దార్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి మొత్తం 190 దరఖాస్తులు రాగా.. అందులో హౌసింగ్కు సంబంధించి159, ఆసరా పెన్షన్లు19, ఇతర శాఖలకు సంబంధించి 12 దరఖాస్తులు ఉన్నాయన్నారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, డీఆర్వో వెంకటాచారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అర్జీలను పెండింగ్ పెట్టొద్దు
రంగారెడ్డి కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జనాల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి 200 మంది అర్జీలు అందజేసినట్లు భూపాల్ రెడ్డి తెలిపారు.
సర్కారు భూముల కబ్జాదారులపై చర్యలు తీసుకోండి
మేడిపల్లి: బోడుప్పల్లోని సర్కారు భూములను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నేతలు మేడ్చల్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కబ్జాల వివరాలను కలెక్టర్కు అందించారు.