- హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్, వెలుగు: యూపీహెచ్ సీ(అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్)కు వచ్చే పేషెంట్లకు కావాల్సిన మందులను అందుబాటులో ఉంచుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. తిలక్నగర్లోని యూపీహెచ్సీని బుధవారం ఆయన సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వివరాలను మెడికల్ ఆఫీసర్ను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్, పేషెంట్స్ చార్ట్ను పరిశీలించారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. యూపీహెచ్ సీని విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని డీఎంహెచ్ వో వెంకటికి ఆయన సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శ్రీకళ, మెడికల్ ఆఫీసర్ దీప్తి తదితరులు ఉన్నారు.
మన బస్తీ – మన బడి పనులు పూర్తి చేయాలి
మన బస్తీ – మన బడి పనులను తొందరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. కాచిగూడలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్ ను ఆయన సందర్శించారు. మన బస్తీ – మన బడి పనులను పరిశీలించి.. అధికారులకు సూచనలు చేశారు. స్కూల్ లోని సమస్యల గురించి స్టూడెంట్లను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఈవో రోహిణి, హెచ్ఎం సుకన్య ఉన్నారు.