వ్యవసాయంలో ఖమ్మం జిల్లా రాష్ట్రానికే ఆదర్శమవ్వాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

వ్యవసాయంలో ఖమ్మం జిల్లా రాష్ట్రానికే ఆదర్శమవ్వాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, వెలుగు :  వ్యవసాయం రంగంలో ఖమ్మం జిల్లా రాష్ట్రానికే ఆదర్శమవ్వాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం  కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో వ్యవసాయ, ఉద్యానవన శాఖల పని తీరుపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఆధునిక సాగు పద్ధతులు పాటించడం, పంటల మార్పిడి విధానం అమలు లాంటి కార్యక్రమాల్లో మన జిల్లా ముందు వరుసలో నిలుపాలన్నారు. ఎరువులు, విత్తనాల లభ్యతపై ఎటువంటి ఫిర్యాదులు రాకుండా అధికారులు పనిచేయాలన్నారు. కల్తీ విత్తనాలు విక్రయం జరగొద్దని, ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

పరిస్థితుల కనుగుణంగా ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను నిర్దేశించాలన్నారు. ప్రతీ వ్యవసాయ విస్తరణ అధికారి తనకు కేటాయించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. నేచురల్ ఫార్మింగ్ జరిగే పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, మిగతా రైతులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, ఇన్​చార్జ్ జిల్లా ఉద్యానవన అధికారి ముత్యాలు, కూసుమంచి, వైరా, ఖమ్మం అర్బన్, సత్తుపల్లి, మధిర ఏడిఏలు, మండల వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ అధికారిణి అనిత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం

పెనుబల్లి :  రైతులకు సరిపోను విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని  కలెక్టర్ అనుదీప్ తెలిపారు. పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజరులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని ఆయన పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సత్తుపల్లి నియోజకవర్గం లో వేగంగా నడుస్తోందన్నారు. బేస్మెంట్ పూర్తి అయిన ఇండ్లకు రూ.లక్ష ఇప్పటికే లబ్ధిదారులకు చెల్లించామని చెప్పారు. వన మహోత్సవానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఆర్డీవో రాజేందర్ గౌడ్, ఎంపీడీవో అన్నపూర్ణ, ఎంఈవో సత్యనారాయణ, ఎంఆర్ఐ జగదీశ్, సీఆర్ జేఈ రమేశ్​ పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలి 

సత్తుపల్లి :   ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పనిచేయాలని  కలెక్టర్ అనుదీప్ అన్నారు. స్థానిక ఏరియా వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు, డయాబెటిస్ కేసుల వివరాలపై డాక్టర్లను ఆరా తీసి పనలు సూచనలు చేశారు.  తర్వాత మండలానికి మజూరైన 576 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వివరాలను హౌసింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్తూరులో  నిర్మిస్తున్న ఇండ్లను పరిశీలించారు. ఇసుక కొరత ఉందని లబ్ధిదారులు పేర్కొనడంతో తక్షణమే ఆర్డీవో తహసీల్దార్ల ద్వారా మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు.