
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: --సీజనల్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి సీజనల్ వ్యాధుల నియంత్రణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. కళావతి బాయి వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. వర్షాకాలంలో గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వీటి నియంత్రణకు ప్రణాళిక ప్రకారం పని చేయాలని తెలిపారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలను వర్షాకాలం సీజన్ ముగిసే వరకు చేయాలన్నారు. డీఆర్వో ఏ. పద్మశ్రీ, డీఆర్డీవో సన్యాసయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అర్జీలను వెంటనే పరిష్కరించాలి
ప్రజావాణి అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇతర సమస్యలపై ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆఫీసర్లను ఆదేశించారు . కలెక్టరేట్ ఏవో సీహెచ్ స్వామి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.