
- హైదరాబాద్ లోక్ సభ రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికల పోలింగ్ సెంటర్లలో ఓటర్లకు, సిబ్బందికి ఇబ్బందులు రాకుండా కనీస వసతులు కల్పించాలని హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శుక్రవారం కార్వాన్, బహదూర్ పురా అసెంబ్లీ సెగ్మెంట్లలోని పోలింగ్ కేంద్రాలు, నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చార్మినార్ డీఆర్సీ సెంటర్లలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ ముందురోజు కేంద్రాల్లో సిబ్బంది ఉండేందుకు గదులను, పరిసరాలను క్లీన్ చేయానలి తెలిపారు.
ఓటర్లకు అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, కరెంటు, టాయిలెట్స్, షెడ్స్, షామియానా, ఫర్నిచర్, కూలర్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. స్కూళ్లలో సంబంధిత అటెండర్లు, సిబ్బంది ఎవరూ ఉండొద్దని చెప్పారు. పోలింగ్ సెంటర్లలోకి ఓటేసేందుకు ఎలాంటి గుర్తింపు కార్డు లేని వారిని అనుమతించవద్దని (నో ఐడీ నో ఎంట్రీ) స్పష్టంచేశారు. శనివారం సాయంత్రం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పూర్తయిన వెంటనే బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచి నిఘా పెట్టాలని, మెటల్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సెల్ ఫోన్లకు నో పర్మిషన్
పోలింగ్ రోజు సెంటర్లలోకి సెల్ ఫోన్లకు నో పర్మిషన్ అని కలెక్టర్ స్పష్టంచేశారు. ఓటర్లు, ఎన్నికల సిబ్బంది గమనించి సెల్ ఫోన్లను పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకురావద్దని సూచించారు.