
- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
లింగంపేట, వెలుగు : మండలంలో ‘భూభారతి’ కార్యక్రమంలో 4,225 దరఖాస్తులు రాగా, 4,100 దరఖాస్తుల పరిశీలన పూర్తైనట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. గురువారం లింగంపేట తహసీల్దార్ ఆఫీస్లో రెవెన్యూ ఆఫీసర్లు, సిబ్బంది చేపడుతున్న డెస్క్ వర్క్ పనులను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ కింద లింగంపేట మండలంలోని 25 గ్రామాల్లో రైతు సదస్సులు నిర్వహించామని తెలిపారు.
రెవెన్యూ ఆఫీసర్లు, సర్వే టీం సభ్యులు క్షేత్ర స్థాయిలో దరఖాస్తులను పరిశీలిస్తున్నారని, మిగిలిన 125 దరఖాస్తుల పరిశీలన త్వరలో పూర్తవుతుందన్నారు. కార్య క్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్, తహసీల్దార్ సురేశ్, డిప్యూటీ తహసీల్దార్ రాందాస్, ఆర్ఐ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం తూకంలో వేగం పెంచండి
సదాశివనగర్, వెలుగు : అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాల్లో వేగం పెంచి మిల్లులకు పంపించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం మండలంలోని కుప్రియాల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ గంగాసాగర్, ఎంపీడీవో సంతోష్కుమార్, సీసీ దర్ని ఆంజనేయులు పాల్గొన్నారు. బీబీపేట్ మండలంలోని మాల్కపుర్, సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి, దోమకోండ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్కలెక్టర్ వి.విక్టర్ పరిశీలించారు.