
- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, వెలుగు : వడ్ల కొనుగోళ్లు త్వరగా కంప్లీట్ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం భిక్కనూరు మండలం జంగంపల్లిలోని కొనుగోలు సెంటర్ను పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 3. 67 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశామన్నారు. నిరుటితో పోలిస్తే 40 శాతం అధికంగా వడ్లు కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకు 70,358 మంది రైతుల నుంచి 851 కోట్ల విలులైన వడ్లను కొనుగోలు చేశామన్నారు.
దొడ్డు రకం 1.88 లక్ష మెట్రిక్ టన్నులు, సన్న రకం 1.78 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతుల అకౌంట్లలో ఇప్పటి వరకు రూ.762 కోట్లు జమయ్యాయన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున సెంటర్లలో త్వరగా కాంటాలు పెట్టి మిల్లులకు తరలించాలన్నారు. సివిల్ సప్లయ్ డీఎం రాజేందర్, డీఎస్వో మల్లికార్జున బాబు, డీసీవో రాంమోహన్, తదితరులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు త్వరగా నిర్మించుకోవాలి
కామారెడ్డి టౌన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పత్రాలు అందజేయటంతో పాటు, ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. నిర్మాణ బిల్లులను ప్రతి సోమవారం ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. జిల్లాలో 2వ దశలో 11,153 ఇండ్లు మంజూరయ్యాయన్నారు. కామారెడ్డి నియోజక వర్గంలో 3206, ఎల్లారెడ్డిలో 3496, జుక్కల్లో 3019, బాన్పువాడలో 1432 ఇండ్లు మంజూరయ్యాయన్నారు. ఇప్పటి వరకు 2,250 ఇండ్లకు ముగ్గు పోసినట్లు తెలిపారు. హౌజింగ్ పీడీ విజయ్పాల్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేంధర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగించాలి
కామారెడ్డి పట్టణంలో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వార్డు నంబర్ 17 అశోక్నగర్కాలనీ, స్నేహపూరి కాలనీలో పారిశుధ్య పనులను కలెక్టర్ పరిశీలించారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకొవాలని అధికారులను ఆదేశించారు. దోమల వ్యాప్తిచెందకుండా ఫాగింగ్ నిర్వహించాలన్నారు. ప్రతి రోజు వార్డు ఇన్చార్జీలు తమ వార్డులో పర్యటించాలన్నారు. తాగునీటి పైపులైన్లు లీకేజీలు లేకుండా చూడాలన్నారు. కమిషనర్ రాజేంధర్రెడ్డి, ఏఈ శంకర్ తదితరులు ఉన్నారు.