ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డిటౌన్, వెలుగు : ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్​ ప్రాక్టికల్ ఎగ్జామ్స్​ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం ప్రాక్టికల్ ఎగ్జామ్స్, థియరీ ఎగ్జామ్స్​కు సంబంధించిన అంశాలపై అధికారులతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. ఇంటర్​ పరీక్షల కోసం చీప్ సూపరింటెండెంట్లు, డిపార్ట్​మెంట్ అధికారులు, ఫ్లయింగ్ స్వ్కాడ్​ను నియమించామన్నారు.

 సెంటర్లలో కనీస వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.  సెంటర్లకు నిరంతరాయంగా విద్యుత్​ సరఫరా చేయాలని, అంతరాయం ఏర్పడితే వెంటనే సరి చేయాలని సూచించారు.  విద్యార్థులు హాల్​టికెట్లను ఆన్​లైన్​లో  డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

పీఎం సూర్య ఘర్ ముఫ్త్​ బిజిలి యోజన  స్కీమ్​పై చర్చ..

పీఎం సూర్య ఘర్​ ముఫ్త్​ బిజిలి యోజన మోడల్ విలేజీ స్కీమ్​లో భాగంగా భిక్కనూరు మండల కేంద్రంలో చేపట్టనున్న  సోలార్​ ప్రాజెక్టుపై అధికారులతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చర్చించారు. అధికారుల కమిటీ రిపోర్టు కలెక్టర్​కు అందించారు. భిక్కనూరులోని 28 ప్రభుత్వ భవనాలపై సోలార్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు కోసం పరిశీలించామని తెలిపారు. 116 కిలో వాట్స్ సామర్థ్యం సిస్టమ్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.  

ప్రజావాణికి 91 ఫిర్యాదులు.. 

కామారెడ్డి కలెక్టరేట్​లో  సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 91 ఫిర్యాదులు వచ్చాయి.  కలెక్టర్ ఆశిష్​సంగ్వాన్​, అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మదన్మోహన్,  సబ్ కలెక్టర్ కిరణ్మయి  ఫిర్యాదులను స్వీకరించారు.  ఫిర్యాదుదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  అనంతర అధికారులతో  నిర్వహించిన మీటింగ్​లో  కలెక్టర్​ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులను అధికారులు క్షుణంగా పరిశీలన చేసి పరిష్కరించాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు వెంటనే మార్కవుట్ ఇవ్వాలన్నారు.  భూభారతి, ప్రజావాణి అప్లికేషన్లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు.