ఉచిత బస్సుతో మహిళలకు మేలు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ఉచిత బస్సుతో మహిళలకు మేలు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డిటౌన్, వెలుగు : మహాలక్ష్మీ స్కీంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలకు ఆర్థికంగా ఆదా అవుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు.   బుధవారం కామారెడ్డి ఆర్టీసీ బస్టాండులో  సంబురాలు నిర్వహించారు.  మహిళా ప్రయాణికులను సన్మానించారు.  విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుతులు అందించారు.  స్పెషల్ టూర్​ ప్యాకేజీ  కరపత్రాలను రిలీజ్ చేశారు.  ఎస్పీ రాజేశ్​చంద్ర,  ఏఎస్పీ చైతన్యారెడ్డి, ఆర్డీవో వీణ, ఆర్టీసీ డీఎం కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. 

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత.. 

ప్రకృతిలో మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.  బుధవారం దేవునిపల్లి ప్రైమరీ స్కూల్​లో జరిగిన వనమహోత్సంలో కలెక్టర్​ పాల్గొని మొక్కలు నాటారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యతగా అందించాలన్నారు.  డీఈవో రాజు, మున్సిపల్ కమిషనర్ రాజేందర్​రెడ్డి,  ఎంఈవో ఎల్లయ్య,  కో ఆర్డినేటర్ వేణుగోపాల్​ తదితరులు పాల్గొన్నారు.   అనంతరం జిల్లా యోగా భవన్​లో జరిగిన  వనమహోత్సవంలో కలెక్టర్ మొక్క నాటారు.  

రెడ్డిపేట తండా హైస్కూల్ స్టూడెంట్ గంగావత్​ సందీప్​ యోగా పోటీల్లో గోల్డ్ సాధించి, స్పోర్ట్స్ కోటాలో బాసర త్రిపుల్ ఐటీలో సీటు సాధించినందున సన్మానించారు. జిల్లా వ్యవసాయ అధికారి మోహన్​రెడ్డి,  యోగా గురువు రాంరెడ్డి,  ప్రతినిధులు రఘుకుమార్,  సురేందర్, వెంకటేశం,  సిద్దాగౌడ్, రాజు పాల్గొన్నారు.  
 
దేవునిపల్లి పీహెచ్​సీని తనిఖీ చేసిన కలెక్టర్​

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి పీహెచ్​సీని బుధవారం కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ తనిఖీ చేశారు. పీహెచ్​సీ మెడికల్ ఆఫీసర్,  డిప్యూటీ డీఎంహెచ్​వో డ్యూటీలో లేకపోవడంతో  నోటీసులు జారీ చేయాలని  డీఎంహెచ్​వో చంద్రశేఖర్​ను కలెక్టర్ ఆదేశించారు.  సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న దృష్ట్యా  అలర్ట్​గా ఉండాలని సిబ్బందికి సూచించారు.  
.