
కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు : నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద రూ. 9 కోట్ల 98 లక్షలతో ఎకో టూరిజం పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం తన చాంబర్లో అధికారులతో నిర్వహించిన రివ్యూలో మాట్లాడారు. ప్రాజెక్టు వద్ద 12 ఎకరాల 30 గుంటల భూమిని ఏకో టూరిజం కోసం సేకరించామన్నారు. డిలక్స్ రూమ్స్, యోగా సెంటర్, రెస్టారెంట్, డార్మెంటరీ, థీమ్ గార్డెన్, చిన్న పిల్లల ప్లే గ్రౌండ్ నిర్మాణం చేపట్టనున్నామన్నారు. శంకుస్థాపనలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టూరిజం కార్పొరేషన్ డీఈ విద్యాసాగర్, ఏఈ సోహుల్, జిల్లా టూరిజం అధికారి జగన్నాథం పాల్గొన్నారు.
మెరుగైన సేవలు అందించాలి..
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం క్యాసంపల్లిలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కాలం చెల్లిన మందులను రోగులకు ఇవ్వరాదన్నారు. విధుల్లో అలసత్వం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో చంద్రశేఖర్ను కలెక్టర్ ఆదేశించారు.
ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ల అందజేత..
దోమకొండ పోర్ట్ తరఫున ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను శనివారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కు ప్రతినిధులు అందించారు. వీటిని దేవునిపల్లి, బీబీపేట, భిక్కనూరు, లింగంపేట, రామారెడ్డి, నాగిరెడ్డి, నస్రుల్లాబాద్ పీహెచ్సీలకు అందించారు. డీఎంహెచ్లో చంద్రశేఖర్, డాక్టర్లు పాల్గొన్నారు.