
కామారెడ్డి, వెలుగు : 40 ఏండ్లు పైబడిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్, కామారెడ్డి టౌన్లో స్వయం సహాయక సంఘ సభ్యులకు నిర్వహించిన వైద్య శిబిరాన్ని పరిశీలించి మాట్లాడారు. మధ్య వయస్సువారికి వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ముందే టెస్టులు చేయించుకుంటే సమస్యను అధిగమించవచ్చన్నారు. సదరం క్యాంపునకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ చందర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, ఆర్ఎంవోలు, డాక్టర్లు పాల్గొన్నారు.
నాణ్యమైన కోడిగుడ్లను సప్లై చేయాలి
కామారెడ్డిటౌన్, వెలుగు : అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ స్కూల్స్కు నాణ్యమైన కోడిగుడ్లను సప్లై చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఏజెన్సీలకు సూచించారు. శుక్రవారం కోడిగుడ్ల సప్లై కోసం టెండర్లను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో పోషకాహారం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అడిషనల్ కలెక్టర్ చందర్, అధికారులు వెంకటేశ్, దయానంద్, సతీశ్యాదవ్ పాల్గొన్నారు.
ఆపరేషన్ ముస్కాన్లో 68 పిల్లల గుర్తింపు
కామారెడ్డి, వెలుగు : ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా కామారెడ్డి జిల్లాలో 68 మంది పిల్లలను గుర్తించినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. పోలీసు, రెవెన్యూ, కార్మిక, బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ జూలై 1 నుంచి 31 వరకు చేపట్టామన్నారు. బాల కార్మికులు, వీధి బాలల గుర్తింపు, తప్పిపోయిన పిల్లల గుర్తించి రక్షణ కల్పించామన్నారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు
తెలిపారు.