
రంగారెడ్డి,వెలుగు: ఇకనుంచి పేపర్లు, ఫైళ్లు ఉండవని, అంతా ఎలక్ట్రానిక్మయమేనని రంగారెడ్డి కలెక్టర్ శశాంక తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో ‘ఈ-ఆఫీస్’ ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం మొదటి విడతగా వ్యవసాయ , ముఖ్య ప్రణాళిక, పంచాయతీ రాజ్, మైనారిటీ సంక్షేమ, మున్సిపల్, మెప్మా, మహిళా శిశు సంక్షేమ, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖల్లో ప్రారంభిస్తున్నట్టు, ఆయా డిపార్టుమెంట్లల్లో ప్రతి ఫైల్ ను ఆన్లైన్ లోనే పంపాలని సూచించారు. మిగిలిన శాఖల అధికారులు కూడా వచ్చే మూడు నెలల్లోగా ఈ -ఆఫీస్ను అమలు చేయాలని ఆదేశించారు.
అవసరమైన శాఖలకు అన్ని రకాల టెక్నికల్ సాయం అందించడానికి చొరవ తీసుకోవాలని అధికారులకు సూచించారు. అధికారులకు, టెక్నికల్ అసిస్టెంట్లతో ఆన్లైన్లో ఫైళ్ల నిర్వహణపై శిక్షణ కూడా ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగికి ప్రత్యేక ఐడీ, పాస్వర్డ్ లను కేటాయింపు చేశారు. సదరు ఉద్యోగి, అధికారి మాస్టర్ డేటాకు లింక్ అయి ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రతీమా సింగ్ , డీఆర్ఓ సంగీత, ఏఓ సునీల్, సీపీఓ సౌమ్య, సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు పాల్గొన్నారు.