నీళ్ల చారు, రుచి లేని ఫుడ్డు ఎలా తింటారు .. మధ్యాహ్న భోజనం నాణ్యతపై కలెక్టర్ ఆగ్రహం

నీళ్ల చారు, రుచి లేని ఫుడ్డు ఎలా తింటారు .. మధ్యాహ్న భోజనం నాణ్యతపై కలెక్టర్ ఆగ్రహం
  • సల్కేర్ పేట్ అంగన్‌‌వాడీ, ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ పరిశీలన

గండీడ్, వెలుగు: నీళ్ల చారు, రుచి పచి లేని ఫుడ్డు పిల్లలు ఎలా తింటారని మహబూబ్‌‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  గురువారం గండీడ్ మండలం సల్కర్ పేట్ గ్రామంలోని  ప్రాథమిక పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో విజిట్ చేశారు.  స్కూల్స్ లో విద్యార్థులకు బోధన, హాజరు,  భోజనా నాణ్యతలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు.  రెండు అంగన్వాడీ  కేంద్రాల్లో  భోజనం నాణ్యత పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.  

పప్పు పలుచగా ఉండటం,  గుడ్డు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు గుడ్లు పెట్టకుండా పెట్టామని చెప్పడంతో టీచర్లపై మండిపడ్డారు.  చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు నాణ్యమైన ఆహారం అందించాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.  జడ్పీ హై స్కూల్ మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసిన కలెక్టర్,  కూర నీళ్లలా ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.  తహసీల్దార్  మల్లికార్జునరావు, గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జితేందర్‌‌‌‌ రెడ్డి, స్కూల్ టీచర్స్, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.