
సిద్దిపేట రూరల్, వెలుగు: వనమహోత్సవ లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గుర్తించిన ప్రాంతాల్లో ఫిట్టింగ్, ప్లాంటింగ్ చేసి టీజీ ఎఫ్ఎంఎస్ సైట్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఉద్యానవన శాఖలో 1335 ఎకరాల టార్గెట్ కి గాను ఇప్పటి వరకు 428 రైతులు 748 ఎకరాల్లో పలు రకాల తోటల పెంపకం ఐడెంటీఫై చేసినట్లు చెప్పారు.
మిగతా టార్గెట్ సైతం ఆగస్టు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈత, మునగ తోటలకు ప్రాధాన్యత ఇవ్వాలని మామిడి, జామ, సీతాఫలం, నారింజ, కొబ్బరి తోటలు పెట్టాలని సూచించారు. ఎన్ఆర్ఈజీఎస్ కూలీల శాతం పెంచాలని, జిల్లా గ్రామపంచాయతీ శాఖలో పన్ను వసూలు, మిషన్ భగీరథ తాగునీటి పైన దృష్టి పెట్టాలన్నారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ- 2025 పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో జడ్పీ సీఈవో రమేశ్, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, డీపీవో దేవకీదేవి, పంచాయతీ రాజ్ ఈఈ లు శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవులు పాల్గొన్నారు.
జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టాలి
నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేసి రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టాలని కలెక్టర్ హైమవతి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్య శాఖల అధికారులకు కేటాయించిన లక్ష్యాలపై సమీక్షించారు. అన్ని శాఖలు వారికి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయిల్ పామ్సాగు పెరిగేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. మండల స్థాయిలో పెండింగ్ లో ఉన్న లక్ష్యాలను జులై 15 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, డీఏవో రాధిక, జిల్లా ఉద్యాన అధికారి సువర్ణ, జిల్లా మత్స్య శాఖ అధికారి మల్లేశం, పశుసంవర్ధక శాఖ అధికారి కొండల్ రెడ్డి పాల్గొన్నారు.