
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్హైమావతి సూచించారు. గురువారం హుస్నాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఫార్మా మెడికల్స్టోర్లో రిజిస్టర్మెయింటైన్ చేయాలని సూచించారు. కాలం చెల్లిన మెడిసిన్తీసివేయాలన్నారు. పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ను సందర్శించారు.
స్కూల్లో అడ్మిషన్ ల సంఖ్య పెంచాలని టీచర్లను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం బాగుందా, పాఠాలు బాగా చెప్తున్నారా అని స్టూడెంట్స్ను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను, గౌరవెల్లి ప్రాజెక్టు పనులను పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
దరఖాస్తులను అన్లైన్ చేయాలి..
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఫీల్డ్ విచారణ చేసి పరిష్కరించాలని కలెక్టర్హైమావతి ఆధికారులను ఆదేశించారు. మండలంలోని సముద్రాల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును తనిఖీ చేసి విచారణ పూర్తయిన దరఖాస్తులను ఆన్ లైన్ లోనమోదు చేయాలని సూచించారు. రెవెన్యూ సదస్సుకు వచ్చిన ప్రతి దరఖాస్తు గురించి పూర్తి వివరాలు తీసుకోవాలన్నారు. భూ భారతి చట్టం ప్రకారం వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. వింజపల్లిలో రెవెన్యూ సదస్సును అడిషనల్ కలెక్టర్ అబ్దుల్హామీద్ సందర్శించారు.