
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వడంతో విశ్వసనీయత మరింతగా పెరుగుతుం దని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 20 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. ప్రతీ పౌరుడు సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై సమాచారం పొందడమే కాకుండా, ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వామ్యులు కావాలని సూచించారు.
అన్ని శాఖల అధికారులు తమ శాఖల వారీగా కార్యకలాపాలు, సేవలు, నిర్ణయాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో జిల్లా అధికారిక వెబ్ సైట్లో పొందు పర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ కార్యాలయంలో పీఐఓ, ఏపీఐఓ, అప్పిలేట్ అథారిటీ నియమించి, ఆర్టీఐ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం అధికారులు ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, సీపీఓ సంజీవరావు, డీఏఓ బాబూరావు, డీఎంహెచ్ఓ జయలక్ష్మి, డీసీఓ రుక్మిణి పాల్గొన్నారు.