
సంగారెడ్డి టౌన్, వెలుగు: ట్రిపుల్ఆర్, నీమ్జ్ ఏర్పాటుకు భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్క్రాంతి సూచించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో రెవెన్యూ, నీమ్జ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. నీమ్జ్ ఏర్పాటుకు ఇప్పటివరకు సేకరించిన భూమికి రక్షణ కంచెను ఏర్పాటు చేయాలన్నారు. రీజినల్ రింగ్ రోడ్ పూర్తయితే విద్య, వాణిజ్య, వ్యాపార రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు. నీమ్జ్ ఏర్పాటుతో జహీరాబాద్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయన్నారు.
ఈ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూములు ఇచ్చిన వారికి పరిహారం అందిస్తామని తెలిపారు. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు సేకరించిన భూ వివరాలను తెలుసుకున్నారు. సమీక్షలో అడిషనల్కలెక్టర్ మాధురి, నిమ్జ్ ప్రత్యేక అధికారి రాజు, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.