
కరీంనగర్ టౌన్,వెలుగు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు వయసుకు మించిన బ్యాగుల భారం మోస్తున్నారని, గంగాధర మండలంలోని ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేస్తున్న విధానం ద్వారా బ్యాగుల బరువు తగ్గించాలని సూచించారు. సమావేశంలో డీఈవో చైతన్య జైన్, కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, శ్రీనివాస్, ఆంజనేయులు, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, ఎంఈవోలు,తదితరులు పాల్గొన్నారు.
ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు
తిమ్మాపూర్, వెలుగు: ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే ఫర్టిలైజర్ షాపులపై కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. తిమ్మాపూర్ మండలం అల్గూనూర్లోని సీఎస్ఈ వీఎల్ఈ, శ్రీరామ ఫర్టిలైజర్ షాపులను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువు నిల్వలు, కొనుగోళ్ల రిజిస్టర్ను పరిశీలించారు.
సబ్సిడీ ఎరువులను దారి మళ్లించినా, బ్లాక్ మార్కెట్కు తరలించినా కఠిన చర్యలు తప్పవని షాపుల యాజమానులను హెచ్చరించారు. ఆమెవెంట డీఏవో భాగ్యలక్ష్మి ఉన్నారు. అంతకుముందు ఎల్ఎండీ కాలనీలోని జడ్పీ హైస్కూల్ కాంప్లెక్స్లో టీచర్ల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.