చుక్కల మందుకు..చక్కటి స్పందన

చుక్కల మందుకు..చక్కటి స్పందన

కాశీబుగ్గ, వెలుగు : 5 సంవత్సరాల లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలని వరంగల్​ కలెక్టర్​ ప్రావీణ్య సూచించారు. ఆదివారం వరంగల్​ సిటీలోని దేశాయిపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య సెంటర్​లో పల్స్​పోలియో చుక్కల కార్యక్రమానికి  కలెక్టర్​ ప్రావీణ్య హాజరై చిన్నారులకు  చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ వరంగల్​ జిల్లాలో  456 బూత్​లను ఏర్పాటు చేసనట్టు తెలిపారు.  

హై రిస్క్​ ప్రాంతాలుగా గుర్తించిన వాటి పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, 100 శాతం పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని  ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్​ఓ వెంకటరమణ, డాక్టర్లు ప్రకాశ్​, గోపాలరావు, భారత్​ కుమార్​ ఉన్నారు. 

మహబూబాబాద్​ అర్భన్ ​​: జిల్లాలో నిర్వహించిన పల్స్​పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ప్రారంభించారు.  ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.  ఆయనతోపాట వైద్య ఆరోగ్యశాఖ అధికారి అంబరీష్ , ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయకుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధీర్ రెడ్డి  ఉన్నారు. 

కమలాపూర్ : మండలంలో ఆదివారం 4000 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు  వేసినట్లు వైద్యులు నాగరాజు తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ముఖ్యఅతిథిగా జడ్పీటీసీ లాండిగె కల్యాణి పాల్గొన్నారు.  

నల్లబెల్లి  :  నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో పోలియో చుక్కలను నల్లబెల్లి. మేడిపల్లి డాక్టర్ శశికుమార్,  దుగ్గొండి డాక్టర్ కిరణ్ రాజ్  వేశారు. 

జనగామ అర్బన్ : పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని  జనగామ  అడిషనల్​ కలెక్టర్​ పర్మర్​ పింకేశ్​ కుమార్, మున్సిపల్​ చైర్​పర్సన్​ పోకల జమున  అన్నారు.  కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్​ ఆఫీసర్ రహమాన్​ పాల్గొన్నారు.