
మెదక్, వెలుగు: జిల్లా రైతుల సౌకర్యార్థం ధాన్యం తూర్పార బట్టే, తేమశాతం తగ్గించే యంత్రాలను వచ్చే సీజన్ నుంచి అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాకు కొత్తగా 6 ప్యాడీ క్లీనర్లు, ఒక ప్యాడీ డ్రైయర్వచ్చాయన్నారు. ఈ మేరకు బుధవారం మెదక్ వ్యవసాయ మార్కెట్ యార్డులో అడిషనల్ కలెక్టర్ నగేశ్, సివిల్ సప్లై డీఎం జగదీశ్, డీఎస్వో సురేశ్ రెడ్డి, మార్కెటింగ్ అధికారి యాదయ్యతో కలిసి వాటిని పనితీరును పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. 3 ప్యాడీ క్లీనర్లను మెదక్ మార్కెట్ యార్డుకు, మరో మూడింటిని రామాయంపేట మార్కెట్ యార్డుకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ధాన్యం తూర్పార బట్టే యంత్రం ద్వారా సునాయాసంగా గంటకు రెండు నుంచి రెండున్నర ఎకరాల ధాన్యాన్ని ఒక మనిషి సహాయంతో పూర్తిస్థాయిలో శుభ్రం చేయవచ్చని తెలిపారు. ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు.
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
చిన్నశంకరంపేట, వెలుగు: నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మితే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. బుధవారం శంకరంపేట్ మండలం గవ్వలపల్లి ఎక్స్ రోడ్ లోని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతీ డీలర్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని, తమ దుకాణంలోని స్టాక్ వివరాలు బోర్డుపై ప్రదర్శించాలన్నారు. గడువు ముగిసిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అయ్మొద్దని చెప్పారు. రైతులకు అమ్మకానికి సంబంధించిన రశీదు ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలు ఎక్కడైనా విక్రయిస్తునట్లు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.