సర్కార్ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

సర్కార్ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి  : కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట, వెలుగు: జిల్లాలోని సర్కార్ దవాఖానలు మెరుగైన వైద్య సేవలకు నిలయాలుగా మారాయని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం రామాయంపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఆస్పత్రి డాక్టర్లు, అధికారులతో తిరుగుతూ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. 

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బంది హాజరు పట్టికలు, మందుల నిల్వలు, ఓపీ,  సీజనల్ వ్యాధులపై రక్త నమూనాల సేకరణకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్య సేవలపై ఆస్పత్రి సిబ్బందికి తగు సూచనలు,  సలహాలు అందించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అవసరమగు మందులు నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.