
కొల్చారం, వెలుగు: ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకే భూభారతి చట్టం ప్రవేశపెట్టారని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సును సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని సూచించారు. దరఖాస్తులను నింపడంలో పొరపాట్లు చేయవద్దని చెప్పారు.
అధికారులు లబ్ధిదారులతో ముందుగా మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. భూభారతిలో ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని అందుకు కావలసిన పత్రాలను సమర్పించాలన్నారు. ఏమైనా సందేహాలు, అపోహలు ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా 35 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా 1,670 దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు. గడిచిన మూడు రోజుల్లో 97 గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో మొత్తం 4,300 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.