
శివ్వంపేట, వెలుగు: ఆయిల్ పామ్ సాగులో మెదక్ జిల్లా ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం శివంపేట మండలం రత్నాపూర్ లో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ప్రారంభించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్, ఏడీఏ సంధ్యారాణి, ఆయిల్ పామ్ కంపెనీ సీఈవో వీరారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ఆయిల్ పామ్ తోటల సాగుకు అనుకూలంగా ఉన్నట్లు ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రం, పెదవేగి శాస్త్రవేత్తలు జిల్లాను సందర్శించి ధ్రువీకరించారన్నారు.
ఆయిల్పామ్సాగు కోసం ఇప్పటివరకు 1,545 ఎకరాలకి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకొన్నారని, అందులో 771 ఎకరాలు ఆయిల్ పామ్ తోటలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. రైతులకు మొక్కలు సరాఫరా చేసేందుకు లివ్ పామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో 40 ఎకరాల స్థలంలో నర్సరీని ఏర్పాటు చేసిందని తెలిపారు. రత్నాపూర్ లో బానోత్ బోని, బానోత్ రవి 7.30 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడానికి ముందుకు వచ్చినందుకు కలెక్టర్ వారిని అభినందించారు.
పకడ్బందీగా రెవెన్యూ సదస్సులు..
నర్సాపూర్: రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. బుధవారం నర్సాపూర్ మండలం చిప్పలతూర్తిలో రెవెన్యూ సదస్సు నిర్వహణ తీరును నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు.
మంబోజిపల్లిలో బడిబాట..
మెదక్ టౌన్: మెదక్ మండలం మంబోజిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుంచి అవుసులపల్లి ప్రాథమికోన్నత పాఠశాల వరకు బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్రాజ్ పాల్గొని 10 కే ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడిబాట విద్యార్థుల భవిష్యత్తుకు పూలబాట అని, బడీడు పిల్లందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులతో కార్పొరేట్స్థాయిలో మౌలిక వసతులు ఉంటాయని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్కలెక్టర్ నగేశ్, ఏఎస్పీ ఎస్పీ మహేందర్, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఈవో రాధాకిషన్, సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.