జొన్నల కొనుగోలు పకడ్బందీగా చేపట్టాలి : రాజర్షి షా

జొన్నల కొనుగోలు  పకడ్బందీగా చేపట్టాలి : రాజర్షి షా

ఆదిలాబాద్, వెలుగు :  రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జొన్నల కొనుగోళ్లు  చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని  తనిఖీ చేశారు.  ఇప్పటివరకు అదిలాబాద్ మార్కెట్ యార్డ్ కు 3,415 మంది రైతుల  నుంచి 82,000 క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు తెలిపారు. ఇంకా 15 వేల క్వింటాళ్లు రావచ్చని  అంచనా వేస్తున్నామని తెలిపారు. అనంతరం  ఇచ్చోడ మార్కెట్ యార్డ్ ను  తనిఖీ చేసి అక్కడ వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటివరకు 2119 మంది రైతుల నుంచి 40,500 క్వింటాళ్ళ జొన్నలు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. 

వర్ష సూచనలు ఉన్నందున అధికారులు రైతులకు ఇబ్బంది కలగకుండా ఈనెల 31 వరకు    కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు. రైతులు జొన్నలు తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని అధికారులకు సూచించారు.  కొనుగోలు కేంద్రాల్లో  సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, ప్యాడి క్లీనర్లు అందుబాటులో ఉండేలా   చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  వర్షాల వల్ల ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట  అడిషనల్​ కలెక్టర్ శ్యామలాదేవి,  సహకార అధికారి బి మోహన్ , మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్  తదితరులు ఉన్నారు