
వేములవాడ, వెలుగు: తిప్పాపూర్ -రాజన్న గోశాలలోని కోడెలను పంపిణీ చేయడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఆదివారం గోశాలను ఆయన తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన కోడెలు స్థానిక రైతులకు ఉచితంగా సోమవారం పంపిణీ చేస్తున్నామని, కోడెల పంపిణీ చేసే రైతులకు సంబంధించి వివరాలు సేకరించాలన్నారు. రైతుల దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వాటిని పంపిణీ చేయాలని కలెక్టర్ తెలిపారు.
గోశాలలో అనారోగ్యంగా ఉన్న కోడెల ఆరోగ్య స్థితిగతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను శుభ్రం చేసి, గడ్డిని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ అన్వేష్, వెటర్నరీ డాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.