మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: ఈ నెల 28 నుంచి మార్చి 5 వరకు జరగనున్న మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను సక్సెస్ చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వివిధ అంశాలపై రివ్యూ చేశారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, రథోత్సవం,శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, వైద్య శిబిరాలతో పాటు అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్ లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో మద్యం, కల్లు, మాంసం విక్రయాలను నిరోధించేందుకు నిఘా పెట్టాలని ఆదేశించారు. కొండ పైకి వెళ్లే భక్తుల కోసం మినీ బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఏర్పాట్లను పరిశీలించారు. అడిషనల్ ఎస్పీ ఎన్బీ రత్నం, అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఈవో శ్రీనివాస రాజు, ఆలయ చైర్మన్ అలహరి మధుసూదన్, లైబ్రరీ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ఆర్డీవో నవీన్ పాల్గొన్నారు.
