- కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
ఆర్మూర్, వెలుగు : భూభారతి, గ్రామ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పెండింగ్దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. గురువారం ఆర్మూర్ తహసీల్దార్ఆఫీస్ తనిఖీ చేసి మాట్లాడారు. ఆయా మాడ్యూల్స్ లో వచ్చిన దరఖాస్తులు ఎన్ని, సాదాబైనామా అర్జీలలో ఎన్ని ఆమోదం పొందాయి, ఎన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి, పీవోటీ భూములకు సంబంధించిన దరఖాస్తులు ఎన్ని వచ్చాయనే విషయాలను తహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు.
సాదాబైనామా దరఖాస్తులకు సంబంధించి అర్హులను గుర్తిస్తే, వారికి తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. చిన్నచిన్న కారణాలతో దరఖాస్తులను రిజెక్ట్ చేయవద్దని, ఫీల్డ్ లెవల్ లో పక్కాగా పరిశీలించాలన్నారు. దరఖాస్తులను తిరస్కరణకు కారణాలను స్పష్టంగా పేర్కొనాల తెలిపారు. ఆమోదం పొందిన వాటితో పాటు తిరస్కరణకు గురైన సాదాబైనామా దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో రెండు రోజుల్లో నమోదు చేయాలని ఆదేశించారు.
ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి
బాల్కొండ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సన్నాహక ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం కమ్మర్ పల్లి, వేల్పూర్ మండలాల్లో పర్యటించారు. అనంతరం కమ్మర్ పల్లి తహసీల్దార్ఆఫీస్ లో ఆఫీసర్లతో సన్నాహక ప్రక్రియ అమలు, భూభారతి దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. 2002 ఓటర్ జాబితాతో సరిపోల్చుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాలో వివరాలు ఉన్నాయా అని ఆరా తీశారు. నిర్ణీత గడువులోగా సన్నాహక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. భూభారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ
వేల్పూరు మండలం అంక్సాపూర్ లో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను రైస్ మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి బిల్లుల చెల్లింపు విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
