
నిజామాబాద్, వెలుగు : భూ సమస్యలపై వచ్చిన ధరణి దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన జిల్లాలోని తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. మండలాల వారీగా అప్లికేషన్లను సమీక్షించి అసంతృప్తి వ్యక్తం చేశారు.
డివిజన్ ఆఫీసర్లు ప్రతి రోజు ఒక మండలాన్ని విజిట్ చేసి పురోగతి పరిశీలించాలని, ఫీల్డ్ విజిట్తో స్పష్టతకు రావాలన్నారు. ప్రతి దరఖాస్తు ఆర్డీవో ఆమోదం కోసం పంపాలని, గవర్నమెంట్ ప్రయారిటీలను గమనించకుండా పనిచేస్తే కుదరదని తహసీల్దార్లను మందలించారు. మీసేవలో వచ్చిన ధరణి అప్లికేషన్లను పరిశీలించాలన్నారు. సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి, సర్కార్ ఆదేశాలు రాగానే నోటీసులు జారీ చేయాలని సూచించారు.
కుర్నాపల్లి కార్యదర్శిపై కలెక్టర్ ఆగ్రహం..
ఎడపల్లి, వెలుగు : మండలం లోని కుర్నాపల్లి గ్రామ కార్యదర్శిపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఒకరికి డెంగ్యూ వచ్చిందని ఆరోగ్య కార్యకర్త శైలజ కలెక్టర్ దృష్టికి తేగా, దోమల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారని అడిగారు. స్ప్రే, ఫాగింగ్ చేయించడం లేదని తెలుపడంతో మండిపడ్డారు.
జిల్లా పంచాయతీ అధికారికి ఫోన్ చేసి, అన్ని గ్రామాల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. గ్రామంలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాద్రి, గ్రామస్తులు హన్మంత్ రెడ్డి, పరిగె సాయిలు, సంజీవ్, గంగాధర్, కృష్ణారెడ్డి, సుమన్ ఉన్నారు.