భారీ వర్షాలు.. కలెక్టర్లు అలర్ట్​గా ఉండాలి: మంత్రి పొంగులేటి

భారీ వర్షాలు.. కలెక్టర్లు అలర్ట్​గా ఉండాలి: మంత్రి పొంగులేటి

 గోదావరి ఉధృతిపై నిరంతరం నిఘా పెట్టండి: పొంగులేటి 

 భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ మంత్రి రివ్యూ  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్ లు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం సాయంత్రం అన్ని జిల్లాల్లో వరద పరిస్థితిని ఆయన సమీక్షించారు. జిల్లా యంత్రాంగం సహాయ పునరావాస చర్యల్లో నిమగ్నం కావాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, గోదావరిలో ప్రవాహం కూడా పెరిగినందున ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి కలెక్టర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.  ముఖ్యంగా గోదావరి ఉధృతిపై నిరంతరం మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

 

అవసరమైన చోట్ల రెస్క్యూ టీంలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టవలసిన రక్షణ చర్యల గురించి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాగుల వద్ద తగిన బందోబస్తును ఏర్పాటు చేసి, ప్రమాదకరంగా ప్రవహించే వాగులను ప్రజలు దాటకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని, పోలీస్ ఇతర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా.. ఏ సమయంలోనైనా ఉన్నతాధికారులను, తమను సంప్రదించాలని మంత్రి సూచించారు.