నేరడిగొండ, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతోందని, అందుకే గురుకులాల్లో సీట్ల కోసం విద్యార్థులు విపరీతంగా పోటీ పడుతున్నారని ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలం పెద్ద బుగ్గారంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్యానెల్స్, క్లాస్రూమ్లను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గురుకులాల్లో ఉత్తమ విద్య, అన్ని సదుపాయాలు ఉండడంతో సీట్లు కావాలంటూ విద్యార్థులు నేరుగా తమ ఇంటికి వస్తున్నారని అన్నారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. స్కూల్లో సీసీ రోడ్డు, డైనింగ్ హాల్, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, ప్రిన్సిపాల్ కృష్ణవేణి, ఏలేటి రవీందర్ రెడ్డి, టీచర్లు పాల్గొన్నారు.
